న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రూ.1.24 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమలులోకి రాగా ఇప్పటి వరకు వసూలైన గరిష్ఠ ఆదాయం ఇదేనని కేంద్రం వెల్లడించింది. 2021 మార్చిలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,23,902 కోట్లు అని తెలిపింది. ఇందులో సీజీఎస్టీ రూ.22,973 కోట్లు (ఫిబ్రవరిలో రూ.21,092 కోట్లు) , ఎస్జీఎస్టీ రూ.29,329 కోట్లు (ఫిబ్రవరిలో 27,273 కోట్లు) కాగా ఐజీఎస్టీ రూ.62,842 కోట్లు (ఫిబ్రవరిలో 55,253 కోట్లు), సెస్ కింద రూ.8,757 కోట్లు (ఫిబ్రవరిలో 9,525) వసూలైనట్లు పేర్కొంది.
గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే 2021 మార్చి నెలలో వచ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ. అలాగే ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలు కాగా మార్చిలో ఇది గరిష్ఠంగా రూ.1.24 లక్షల కోట్లకు చేరింది. నకిలీ బిల్లింగ్పై నిఘా, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలు, సమర్థవంతమైన పన్ను పరిపాలనతో సహా బహుళ వనరుల డేటా లోతైన విశ్లేషణ వంటివి గత కొన్ని నెలలుగా పన్ను ఆదాయంలో స్థిరమైన పెరుగుదలకు దోహదపడ్డాయని ప్రభుత్వం తెలిపింది.
కాగా, జీఎస్టీ వసూళ్ల వృద్ధి ఆర్థిక పునరుద్ధరణ, ప్రజల జీవన పరిస్థితిలో మెరుగును సూచిస్తున్నదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.