ఢాకా: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై భారీ విజయానికి చేరువైంది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన బంగ్లా.. న్యూజిలాండ్ ముందు 332 పరుగుల లక్ష్యాన్ని నిలపగా.. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులతో నిలిచింది. చేతిలో 3 వికెట్లు ఉన్న బ్లాక్ క్యాప్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది.
డారిల్ మిషెల్ (44 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. లాథమ్ (0), విలియమ్సన్ (11), కాన్వే (22), నికోల్స్ (2), బ్లండెల్ (6), ఫిలిప్స్ (12), జెమీసన్ (9) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఓవర్నైట్ స్కోరు 212/3తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా చివరకు 338 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (105) సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ (50) అర్ధశతకాలతో రాణించారు.