ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాజాగా అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ టీమ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థికి అంత లక్ష్యాన్ని నిర్దేశించడం ఇదే తొలిసారి. గత బుధవారం మ్యాచ్ మొదలుకాగా.. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 382, రెండో ఇన్నింగ్స్లో 425 పరుగులు చేసింది.
అప్ఘానిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆ జట్టు ముందు బంగ్లాదేశ్ జట్టు 662 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇవాళ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి అఫ్ఘానిస్థాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. అఫ్ఘాన్ గెలువాలంటే ఆఖరి రెండు రోజుల్లో 617 పరుగులు చేయాలి. డ్రాగా ముగించాలంటే రెండు రోజుల్లో మిగిలిన 8 వికెట్లు పడకుండా కాచుకోవాలి. ఈ రెండు సాధ్యమయ్యే పని కాకపోవడంతో అఫ్ఘానిస్థాన్ ఓటమి దాదాపు ఖారరైనట్లే.
కాగా, బంగ్లాదేశ్ గతంలో ప్రత్యర్థికి విధించిన అత్యధిక లక్ష్యం 477 పరుగులు. 2021 జూలైలో జింబాబ్వే జట్టుకు బంగ్లా ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో అన్ని జట్లను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు ప్రత్యర్థి ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచింది. 1930లో వెస్టిండీస్ జట్టుకు ఇంగ్లండ్ 836 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది.