మిర్పూర్: బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) ఆసీస్పై చారిత్రక విజయం సాధించింది. వన్డేల్లో చివరిసారి 2005లో ఆసీస్పై గెలిచిన బంగ్లా ఇన్నేండ్లకు మళ్లీ ఆ జట్టును ఓడించింది. తొలుత మొసాదెక్ హుస్సేన్(70 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో 86 నాటౌట్)కు తోడు నజ్ముల్ హుస్సేన్ శాంటో (67), తంజిద్ హసన్ (54) అర్ధసెంచరీలతో బంగ్లా 50 ఓవర్లలో 284/8 స్కోరు చేసింది.
నాథన్ ఎలిస్ (3/38) మూడు వికెట్లు తీయగా, స్కాట్ (2/57), రెన్షా (2/5) ఆకట్టుకున్నారు. నాలుగు క్యాచ్లు విడిచిపెట్టిన ఆసీస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అనంతరం ఛేదనలో ఆసీస్ 42.2 ఓవర్ల లో 191/9 స్కోరు తో నిలిచిన దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోగా డక్వర్త్ ప్రకారం బంగ్లా ఘన విజయం సొంతం చేసుకుంది.కామెరాన్ గ్రీన్ (52 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావారు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. నహిద్ రాణా (4/41) నాలుగు వికెట్లతో ఆసీస్ పతనంలో కీలకమయ్యాడు. అర్ధసెంచరీకి తోడు రెండు వికెట్లు తీసిన హుస్సేన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.