166 పరుగుల లక్ష్యఛేదనలో 9 ఓవర్లు ముగిసేసరికి ముంబై 75/1తో నిలిచింది. రోహిత్, ఇషాన్ క్రీజులో ఉండగా.. సూర్యకుమార్, పొలార్డ్, హార్దిక్, కృనాల్ బ్యాటింగ్కు రావాల్సి ఉండటంతో ముంబై విజయం పెద్ద కష్టం కాదనిపించింది. అయితే.. ఇక్కడే బెంగళూరు బౌలర్లు అద్భుతం చేశారు. మ్యాక్స్వెల్, చాహల్ టాపార్డర్ పనిపడితే.. హ్యాట్రిక్ హీరో హర్షల్ పటేల్ మిడిలార్డర్ను కుప్పకూల్చాడు. ఫలితంగా మూడు ఓటముల తర్వాత కోహ్లీసేన గెలుపు రుచిచూస్తే.. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బెంగళూరు: బ్యాటర్ల బాధ్యతయుతమైన ఆటకు.. బౌలర్ల జోరు తోడవడంతో మూడు పరాజయాల తర్వాత బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. ఆదివారం రెండో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్ నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43; 5 ఫోర్లు, ఒక సిక్సర్), డికాక్ (24) రాణించినా.. ఇషాన్ కిషన్ (9), సూర్యకుమార్ యాదవ్ (8), కృనాల్ పాండ్యా (5), పొలార్డ్ (7), హార్దిక్ పాండ్యా (3) పెవిలియన్కు క్యూ కట్టడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. యుజ్వేంద్ర చాహల్కు మూడు వికెట్లు దక్కాయి. ఆల్రౌండర్ మ్యాక్సీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోహ్లీ @ 10000
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి దాటాడు. అంతర్జాతీయ, దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్లో కలుపుకొని 314 మ్యాచ్ల్లో విరాట్ ఈ ఘతన సాధించాడు. భారత్ నుంచి పది వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కిన విరాట్.. ఓవరాల్గా ఐదో ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ (14275), పొలార్డ్ (11195), షోయబ్ మాలిక్ (10808), వార్నర్ (10019) ముందున్నారు.
అదే మలుపు..
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై 105/5తో నిలిచింది. 24 బంతుల్లో 61 పరుగులు అవసరం కాగా.. హార్డ్ హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యా క్రీజులో నిలిచారు. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన హర్షల్ పటేల్ 17వ ఓవర్ రెండో బంతికి హార్దిక్ను బుట్టలో వేసుకున్నాడు. తదుపరి బంతికే పొలార్డ్ క్లీన్ బౌల్డ్ కాగా.. రాహుల్ చాహర్ (0) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోవడంతో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. ఫలితంగా ఒక దశలో 79/1తో పటిష్ట స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆలౌటైంది.
స్కోరు బోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) (సబ్) ఏఎస్ రాయ్ (బి) మిల్నే 51, పడిక్కల్ (సి) డికాక్ (బి) బుమ్రా 0, భరత్ (సి) సూర్యకుమార్ (బి) చాహర్ 32, మ్యాక్స్వెల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 56, డివిలియర్స్ (సి) డికాక్ (బి) బుమ్రా 11, క్రిస్టియన్ (నాటౌట్) 1, షాబాజ్ (బి) బౌల్ట్ 1, జెమీసన్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 22, మొత్తం: 165/6. వికెట్ల పతనం: 1-7, 2-75, 3-126, 4-161, 5-161, 6-162, బౌలింగ్: బౌల్ట్ 4-0-17-1, బుమ్రా 4-0-36-3, మిల్నే 4-0-48-1, కృనాల్ 4-0-27-0, చాహర్ 4-0-33-1.
ముంబై: రోహిత్ (సి) పడిక్కల్ (బి) మ్యాక్స్వెల్ 43, డికాక్ (సి) మ్యాక్స్వెల్ (బి) చాహల్ 24, ఇషాన్ (సి) హర్షల్ (బి) చాహల్ 9, సూర్యకుమార్ (సి) చాహల్ (బి) సిరాజ్ 8, కృనాల్ (బి) మ్యాక్స్వెల్ 5, పొలార్డ్ (బి) హర్షల్ 7, హార్దిక్ (సి) కోహ్లీ (బి) హర్షల్ 3, మిల్నే (బి) హర్షల్ 0, రాహుల్ చాహర్ (ఎల్బీ) హర్షల్, బుమ్రా (బి) చాహల్ 5, బౌల్ట్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 7, మొత్తం: 18.1 ఓవర్లలో 111 ఆలౌట్. వికెట్ల పతనం: 1-57, 2-79, 3-81, 4-93, 5-97, 6-106, 7-106, 8-106, 9-111, 10-111, బౌలింగ్: జెమీసన్ 2-0-22-0, సిరాజ్ 3-0-15-1, క్రిస్టియాన్ 2-0-21-0, హర్షల్ 3.1-0-17-4, చాహల్ 4-1-11-3, మ్యాక్స్వెల్ 4-0-23-2.