Bangladesh : అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ (Bangladesh) ఈ రోజు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై బెబ్బులిలా ఆడుతున్న ఆ జట్టు తొలిసారి పది వికెట్ల తేడాతో గెలుపొంది కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్(Ireland)పై మూడో వన్డేలో 102 పరుగుల టార్గెట్ను 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. రన్రేట్ పరంగా చూస్తే.. వన్డేల్లో బంగ్లాకు ఇదే మూడో అతిపెద్ద విజయం.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 101 రన్స్కు ఆలౌటయ్యింది. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 5 వికెట్లతో ఆ జట్టును దెబ్బకొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్లు లిట్టన్ దాస్(50), తమీమ్ ఇక్బాల్ (41) సిక్స్లు, ఫోర్లతో ఐర్లాండ్ బౌలర్లపై చెలరేగారు. దాంతో, 6.5 ఓవర్లు ఉండగానే బంగ్లాదేశ్ మ్యాచ్ ముగించింది.
పసికూనలా అంతర్జీతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బంగ్లా ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది. తనదైన రోజున పెద్ద జట్లన సైతం మట్టికరిపించగలదు. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి మేటి జట్లను పెద్ద టోర్నీల్లో ఓడించింది. తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal), ముష్ఫికర్ రహీం, షకిబుల్ హసన్, లిట్టన్ దాస్ వంటి సీనియర్లు జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నారు. వీళ్లతో పాటు ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ ఆ జట్టు ప్రధాన బలం. యంగ్స్టర్ మెహిదీ హసన్ మిరాజ్ విధ్వంసక ఇన్నింగ్స్లతో చెలరేగుతున్నాడు. పోయిన ఏడాది భారత్పై వన్డే సిరీస్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఇంగ్లండ్పై కూడా మిరాజ్ రాణించడంతో ఆ జట్టే వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఉపఖండంలో వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో బంగ్లా బలమైన ప్రత్యర్థిలా కనిపిస్తోంది. ఇతర జట్లు ఇక ఆ టీమ్ను పసికూన అనుకోవడానికి లేదు.