Bajrang Punia: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్) అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మల్ల యోధుల క్రీడలో మరోసారి ప్రకంపనలు రేపుతున్నాయి. గురువారం వెల్లడైన ఫలితాలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు అత్యంత సన్నిహితుడైన సంజయ్ సింగ్ గెలుపొందడంపై సీనియర్ రెజ్లర్లు తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం సంజయ్ సింగ్ గెలవగానే ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్.. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించి 24 గంటలు గడవకముందే తాజాగా మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కూడా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. భారత ప్రభుత్వం తనకు అందజేసిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఇదే విషయమై ఎక్స్ (ట్విటర్) వేదికగా భజరంగ్ స్పందిస్తూ… ‘భారత ప్రధానమంత్రికి నేను నా పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నా..’ అని మోడీకి రాసిన బహిరంగ లేఖను షేర్ చేశాడు. లేఖలో పునియా.. ‘ప్రధానమంత్రి గారు, మీరు ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు దైనందిన జీవితంలో చాలా బిజీగా ఉంటారు. కానీ ఈ దేశంలో రెజ్లర్ల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేందుకు ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ ఏడాది జనవరిలో మన మహిళా రెజ్లర్లు తమను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా సాగించిన ఆందోళన గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యుడినయ్యాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో మేం ఆ పోరాటాన్ని విరమించాం….
मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023
కానీ మేం ఆ నిర్ణయం తీసుకున్న మూడు నెలల తర్వాత కూడా బ్రిజ్ భూషణ్ మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాలేదు. దీంతో మేం ఏప్రిల్ లో మళ్లీ నిరసనల బాట పట్టాం. ఢిల్లీ వీధుల్లో మేం చేసిన పోరాటంతో పోలీసులు అతడిపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. జనవరిలో అతడిపై ఫిర్యాదుచేసేందుకు 19 మంది బాధితులు ఉంటే ఏప్రిల్కు వచ్చేసరికి అవి 7 అయ్యాయి. ఆ 12 మందిని బ్రిజ్భూషన్ తీవ్రంగా ప్రభావితం చేశాడు. మా మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. మేం నిరసన వ్యక్తం చేసిన స్థలాన్ని కూడా ఖాళీ చేయించారు. ఇది జరుగుతున్న సమయంలో ఏం చేయాలో మాకు తోచలేదు. అందుకే మేం మా పతకాలను యమునా నదిలో వేయాలనుకున్నాం. కానీ రైతు ఉద్యమ నాయకులు ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరడంతో దానిని ఉపసంహరించుకున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులను కలిసి హామీ ఇచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఆశించాం. వాళ్లు బ్రిజ్ భూషణ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో మేం మా ఆందోళనలను విరమించాం….‘ అని రాసుకొచ్చాడు. రెజ్లింగ్లో దేశానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పునియాకు 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇదే లేఖలో పునియా.. ఎప్పటికైనా న్యాయం గెలిచితీరుతుందని, తనకు పూర్తి విశ్వాసముందని ఆశాభావం వ్యక్తం చేశాడు.