బర్మింగ్హామ్లో భారత్ అథ్లెట్లు సత్తాచాటారు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే రజత పతకంతో సత్తాచాటగా.. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. లాంగ్ డిస్టాన్స్ రన్లో భారత్ తరఫున తొలి పతకం నెగ్గిన పురుష అథ్లెట్గా రికార్డుల్లోకెక్కిన అవినాశ్.. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. శనివారం పోటీలో అవినాశ్ 8 నిమిషాల 11.15 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అబ్రహం కిబివాట్ (8:11:15; కెన్యా), అమోస్ సెరెమ్ (8:16:83; కెన్యా) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. మహారాష్ట్రలోని పేద రైతు కుంటుంబలో పుట్టిన అవినాశ్.. ప్రస్తుతం భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ పోటీలకు ముందు హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్లో రక్షణ విధులు నిర్వర్తించిన అవినాశ్.. కామన్వెల్త్ ప్రదర్శనతో భారతీయులందరినీ ఆనంద డోలికల్లో ముంచెత్తాడు.