డర్బన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండో మ్యాచ్లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్ పట్టేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. బవుమా (35), మర్క్మ్ర (49) రాణించారు.
ఆసీస్ బౌలర్లలో అబాట్, ఎలీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో కంగారూలు 14.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేశారు. కెప్టెన్ మిషెల్ మార్ష్ (39 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం జరుగనుంది.