Meg Lanning : అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఆరు ఐసీసీ ట్రోఫీలు, ప్లేయర్గా ఒకటి.. మొత్తంగా అత్యధిక ట్రోఫీలు గెలిచిన క్రికెటర్గా రికార్డు ఆమె సొంతం. ఆస్ట్రేలియా క్రికెట్పై అంతలా ముద్ర వేసిన ఆమె పేరు మేగ్ లానింగ్(Meg Lanning). మైదానంలో ప్రత్యర్థుల వ్యూహాలను అలవోకగా చిత్తు చేసిన ఆమె అనుకోకుండా ఆసీస్ సారథ్యానికి, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నిరుడు నవంబర్లో లానింగ్ వీడ్కోలు నిర్ణయంతో క్రికెట్ పండితులు తలలు పట్టుకున్నారు. అంతకుముందే కంగారు జట్టుకు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కట్టబెట్టిన ఆమె.. ఆటకు గుడ్ బై చెప్పడం ఏంటబ్బా? అని ఆలోచనల్లో పడ్డారు. కానీ, వాళ్లకు ఏ సమాధానం దొరకలే. చివరకు లానింగ్ తన సంచలన నిర్ణయానికి దారి తీసిన కారణాలను తాజాగా ఒక పొడ్కాస్ట్లో వెల్లడించింది.
‘నేను అవసరమైన దానికంటే ఎక్కువగా వ్యాయామం చేసేదాన్ని. వారానికి 85- 90 కిలోమీటర్లు పరుగెత్తేదాన్ని అయితే.. అందుకు తగ్గట్టుగా తిండి మాత్రం తినలేకపోయా. చివరకు ఎక్సర్సైజ్, డైట్ మధ్య బ్యాలెన్స్ కోల్పోయా. ఆ సమయంలోనే నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. దాంతో, ఊహించనిరీతిలో బరువు తగ్గా. ఒక్కసారిగా 64 కిలోల నుంచి 57 కేజీలకు పడిపోయా. దాంతో, నిద్ర పట్టేది కాదు. ఎంతో ఆందోళనకు లోనయ్యా. ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అందుకనే అర్థాంతరంగా అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాను’ అని లానింగ్ చెప్పుకొచ్చింది.
లానింగ్ 18 ఏండ్ల వయసులోనే క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. మొదల్లో టీ20ల్లో ఆడిన ఆమె ఆ తర్వాత వన్డే, టెస్టు జట్టులోకి వచ్చింది. లానింగ్ సారథ్యంలో ఆసీస్ ఏకంగా 4 సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. మొత్తంగా ఏడు వరల్డ్ కప్ విజేత అయిన లానింగ్ తన 13 ఏండ్ల కెరీర్లో 132 టీ20లు, 103 వన్డేలు ఆడింది. ఆరు టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించింది. ఆమె కెప్టెన్సీలో కంగారు జట్టు 69 వన్డేల్లో, 100 టీ20ల్లో, 4 టెస్టుల్లో గెలుపొందింది.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో లానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు సారథిగా వ్యవహరిస్తోంది. ఆమెను వేలంలో ఢిల్లీ రూ.1.1 కోట్లకు కొన్నది. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టిన లానింగ్ వరుసగా రెండు సీజన్లలోనూ అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్కు తీసుకెళ్లింది.
అయితే.. ఆస్ట్రేలియాకు ఆరు ఐసీసీ ట్రోఫీలు అందించిన రికార్డున్న లానింగ్ .. ఢిల్లీకి మాత్రం టైటిల్ అందించలేకపోయింది. తొలిసారి టైటిల్ పోరులో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ దెబ్బకు ఢిల్లీ చేతులెత్తేసింది. రెండో సీజన్లోనూ ఫైనల్లో ఆర్సీబీ ధాటికి ఢిల్లీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక రెండోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.