శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఓడినా టెస్టు సిరీస్ ను మాత్రం విజయంతో ఆరంభించింది. అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్న లంకను తన స్పిన్ ఉచ్చులో తిప్పేసి ఈ టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది. రెండో ఇన్నింగ్స్ లో లంకను 113 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని అందుకుంది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు విలవిల్లాడారు. నాథన్ లియాన్, స్వెప్సన్ తో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ కూడా లంకను ముప్పుతిప్పలు పెట్టాడు.
గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 212 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీస్.. 70.5 ఓవర్లలో 321 పరుగులకు పెవిలియన్ చేరింది. కామోరాన్ గ్రీన్ (77), ఉస్మాన్ ఖవాజా (71) రాణించారు. దీంతో కంగారూలకు 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆట మూడో రోజు లంక.. రెండో ఇన్నింగ్స్ లో 22.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నె (23) టాప్ స్కోరర్.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మినహా బౌలింగ్ వేసిన లియాన్, స్వెప్సన్, ట్రావిస్ హెడ్ లు లంకకు చుక్కులు చూపించారు. లియాన్ కు 4 వికెట్లు దక్కగా.. స్వెప్సన్ కు రెండు, హెడ్ 2.5 ఓవర్లే వేసి నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో పాటు మొత్తం 9 వికెట్ల తీశాడు లియాన్. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేసిన కామోరాన్ గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లంక నిర్దేశించిన పది పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు బంతుల్లోనే చేధించింది. రమేశ్ మెండిస్ బౌలింగ్ లో వార్నర్ 4, 6 కొట్టి కంగారూలకు విజయాన్ని అందించాడు. ఫలితంగా ఈ సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు జులై 12 నుంచి ఇదే వేదికగా జరుగనుంది.