Andy Flower : తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) చేరిన ఆస్ట్రేలియా విజయం కోసం అన్నిదారులు వెతుకుతోంది. ఫైనల్ ఫైట్లో టీమిండియాకు షాకిచ్చేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇంగ్లండ్ మాజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్( Andy Flower)ను కన్సల్టంట్(Consultant)గా నియమించింది. అతడి ఎంపిక వెనక బలమైన కారణం ఉంది. అదేంటంటే..? ఇంగ్లండ్ హెడ్ కోచ్గా పనిచేసిన ఆండీకి అక్కడి పరిస్థితులపై సుదీర్ఘ అనుభవం ఉండటమే. దాంతో, ఓవల్ స్టేడియం వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్కు చెక్ పెట్టేందుకు ఆసీస్ అతడి సేవల్ని ఉపయోగించుకోనుంది.
జింబాబ్వే(Zimbabwe) మాజీ కెప్టెన్ అయిన ఆండీ ఫ్లవర్ 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ హెడ్ కోచ్గా ఉన్నాడు. అతడి ఆధ్వర్యంలోనే మోర్గన్ సేన 2010లో పొట్టి ప్రపంచకప్ అందుకుంది. అంతేకాదు ఆ జట్టు యాషెస్ సిరీస్ గెలవడంలో ఫ్లవర్ కీలక పాత్ర పోషించాడు. దాంతో, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫ్లవర్ సూచనలు తమకు లాభం చేకూరుస్తాయని ఆసీసీ మేనేజ్మెంట్ భావించింది. అంతేకాదు ఇంగ్లండ్తో 5 టెస్టుల యాషెస్ సిరీస్కు కూడా ఆండీ ఫ్లవర్ను కన్సల్టంట్గా కొనసాగించనుంది.
ఒకప్పుడు జింబాబ్బే జట్టులో ఆండీ ఫ్లవర్ కీలక ఆటగాడు. ఆ తర్వాత అతను కోచ్గా విజయవంతమయ్యాడు. ఇంగ్లండ్ కోచ్గా తప్పుకున్న తర్వాత అతను పలు టీ20 లీగుల్లో హెడ్కోచ్గా సేవలందించాడు. ఐపీఎల్ 16వ(IPL 2023) సీజన్లోనూ అతడు తన సర్వీస్ అందించాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో హెడ్కోచ్గా అతడి పాత్ర చాలా ఉంది. అయితే.. ఎలిమినేటర్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయి లక్నో ఇంటిదారి పట్టింది.
ఓవల్ స్టేడియంలో జూన్ 7 -11 మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలిసారి తలపడుతున్న టెస్టు ఇది. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. స్వదేశంలో 2-1తో ప్యాట్ కమిన్స్ సేనను భారత జట్టు ఓడించింది. దాంతో, ఫైనల్లో కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది.