AUS vs WI: అడిలైడ్ ఓవల్ వేదికగా నేడు వెస్టిండీస్తో ముగిసిన మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో భాగంగా విండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ రనౌట్ అయినా.. అతడు ఆట కొనసాగించడం విశేషం. ఇదేదో అంపైర్ తప్పిదమో లేక టెక్నాలజీ చేసిన తప్పో కాదు.. ఆసీస్ ఆటగాళ్లు పట్టించుకోకపోవడం వల్ల జోసెఫ్ బతికిపోయాడు. పరుగు తీసే క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్లో బౌలర్ స్టంప్స్ పడగొట్టినా.. టీవీ రిప్లేలో అతడు ఔట్ అయినట్టు స్పష్టంగా కనిపించినా జోసెఫ్ మాత్రం బ్యాటింగ్ కొనసాగించడం గమనార్హం.
వివరాల్లోకెళ్తే.. ఛేదనలో భాగంగా 19వ ఓవర్లో స్పెన్సర్ జాన్సన్ వేసిన మూడో బంతిని జోసెఫ్ కవర్స్ దిశగా డ్రైవ్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ సారథి మిచెల్ మార్ష్.. బంతిని అందుకుని నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న జాన్సన్కు విసిరాడు. జాన్సన్ బంతిని అందుకుని స్టంప్స్ను పడగొట్టాడు. బెయిల్స్ కిందపడే సమయానికి జోసెఫ్ బ్యాట్ క్రీజుకు కనీసం ఓ అడుగు దూరంలో ఉంది. కానీ జాన్సన్ మాత్రం జోసెఫ్ క్రీజులోకి వచ్చి ఉంటాడనుకుని అప్పీల్ చేయకుండానే బంతిని తీసుకుని నాలుగో బాల్ వేయడానికి వెళ్లిపోయాడు. అటు మార్ష్ కూడా రనౌట్ అప్పీల్ చేయలేదు. ఈ ఇద్దరే గాక మిగిలిన తొమ్మిది మంది ఆసీస్ ప్లేయర్లు అసలది ఔట్ కాదేమోలే అన్నట్టుగా భావించి లైట్ తీసుకున్నారు.
Extremely bizarre scenes were witnessed at Adelaide Oval.
Spencer Johnson & Mitchell Marsh attempted a run out against Alzarri Joseph and didn’t appeal
Spencer Johnson moved on for his next run up, and later, the big screen showed Alzarri Joseph clearly short of his ground. pic.twitter.com/Y69aFJbY1e
— Udit (@UditKhar) February 11, 2024
కానీ బిగ్ స్క్రీన్ మీద జోసెఫ్ రనౌట్ అయినట్టు స్పష్టంగా కనిపించేసరికి ఆసీస్ ప్లేయర్లు. ‘ఔట్’అని అంపైర్ను కోరారు. కానీ అంపైర్ గెరార్డ్ అబూడ్ మాత్రం దానిని నాటౌట్గా ప్రకటించాడు. ‘అదేంటి, అంత క్లీయర్గా రనౌట్ అయితే నాటౌట్ అంటారు’ అని ఆసీస్ ఆటగాళ్లు గెరార్డ్తో వాదిస్తుంటే.. ‘మీరు అప్పీల్ చేయలేదు.. అందుకే నాటౌట్. ఎవరన్నా ఒక్కరు అప్పీల్ చేసినా నేను థర్డ్ అంపైర్కు రిఫర్ చేసేవాడిని’ అన్నట్టుగా వారితో సంభాషించడంతో విస్తుపోవడం కంగారూల పనైంది. అంపైర్ సమాధానం విన్నాక ఆసీస్ ప్లేయర్లు మార్ష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్లు ఇవేం రూల్స్రా బాబూ అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చారు. రనౌట్ను పట్టించుకోకపోవడం వల్ల జోసెఫ్.. ఔట్ అయినా తిరిగి బ్యాటింగ్ చేయగలిగాడు.
రనౌట్ నుంచి తప్పించుకున్నా జోసెఫ్.. విండీస్ను గెలిపించలేకపోయాడు. ఐదు బంతులాడిన జోసెఫ్.. రెండు పరుగులే చేశాడు. 242 పరుగుల ఛేదనలో విండీస్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్ 34 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ విధ్వంసక వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ (55 బంతుల్లో 120 నాటౌట్, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 కెరీర్లో ఐదో శతకం బాదిన విషయం విదితమే.