టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పాంచ్ పటాకా మోగించారు. పోటీల ఆరో రోజు ఐదు పతకాలతో అదుర్స్ అనిపించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో స్వర్ణ పతకంతో అవని నయా చరిత్ర లిఖిస్తే.. జావెలిన్ త్రోలో సుమిత్ ఒకటికి మూడుసార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ.. పసిడి కొల్లగొట్టాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా రజత పతకం కైవసం చేసుకోగా.. డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా సిల్వర్ మెడల్ చేజిక్కించుకున్నాడు. సుందర్ సింగ్ గుర్జార్కు జావెలిన్ త్రోలో కాంస్యం దక్కింది. విశ్వక్రీడల్లో భారత్ ఒకే రోజు ఐతు పతకాలు సాధించి రికార్డు బ్రేక్ చేయడంతో పాటు ఓవరాల్గా ఏడు మెడల్స్తో పతకాల పట్టికలో 26వ స్థానానికి ఎగబాకింది!
కల నిజమైనట్లు అనిపిస్తున్నది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. శిక్షణలో భాగంగా నేను పలుమార్లు 72 మీటర్ల దూరాన్ని నమోదు చేశాను. కానీ ఈసారి అలాంటి ప్రదర్శన చేయలేకపోయా. అయినా స్వర్ణంతో సంతోషంగా ఉన్నా.
–సుమిత్
ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్లో పలు క్రీడాంశాల్లో పతకాలు సాధించిన విజేతలకు ప్రత్యేక అభినందనలు. మీ అద్భుత విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం
–సీఎం కేసీఆర్
టోక్యో:పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. విశ్వవేదికపై స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా అవని లెఖరా చరిత్ర సృష్టిస్తే.. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్, దేవేంద్ర ఝఝారియా, సుందర్ సింగ్ గుర్జార్ ఒకే రోజు మూడు పతకాలు కొల్లగొట్టి విశ్వక్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిస్కస్త్రోలో యోగేశ్ కథూనియా రజతం సొంతం చేసుకోవడంతో సోమవారం టోక్యోలో భారత్ ఐదు పతకాలు ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో తిరుగులేని గురితో అవని లెఖరా స్వర్ణ సౌరభాలు విరజిమ్మితే.. జావెలిన్ త్రో (ఎఫ్ 64)లో సుమిత్ అంటిల్ ఒకటికి మూడుసార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా ఎఫ్ 46 విభాగంలో రజతం కైవసం చేసుకోగా.. ఇదే ఈవెంట్లో బరిలోకి దిగిన మరో భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ కాంస్యం చేజిక్కించుకున్నాడు. డిస్కస్ త్రో (ఎఫ్56)లో యోగేశ్ కథూనియా రజత కాంతులు విరజిమ్మడంతో సోమవారం భారత్ ఐదు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆదివారం పోటీల్లో భవీనాబెన్ పటేల్
(టేబుల్ టెన్నిస్), నిషాద్ కుమార్ (హై జంప్) సాధించిన రజతాలతో కలిపి ఓవరాల్గా భారత్ ఏడు (2 స్వర్ణాలు, 4 రజతాలు, ఓ కాంస్యం) పతకాలతో పట్టికలో 26వ స్థానంలో నిలిచింది. విశ్వక్రీడల్లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్న మన అథ్లెట్లపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
విశ్వక్రీడల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏ క్షణాన స్వర్ణం సాధించాడో.. అప్పటి నుంచి దేశంలో జావెలిన్ త్రోకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తూ పారాలింపిక్స్లో మన జావెలిన్ త్రో అథ్లెట్లు ఒకే రోజు మూడు పతకాలు సాధించి భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. శిక్షణలో భాగంగా నీరజ్ చోప్రాతో కలిసి ప్రాక్టీస్ చేసిన 23 ఏండ్ల సుమిత్ అంటిల్.. ఆదివారం పోటీల్లో ఐదో ప్రయత్నంలో బరిసెను 68.55 మీటర్ల దూరం విసిరి పసిడి నెగ్గాడు. మిషల్ బ్యురియన్ (ఆస్ట్రేలియా, 66.29 మీ.), దులన్ కొడితువక్కు (శ్రీలంక, 65.61 మీ.) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్ సందీప్ చౌదరి నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నాడు. హర్యానాలోని సోనెపట్కు చెందిన సుమిత్.. 2015లో జరిగిన ఓ ద్విచక్రవాహన ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయాడు. అంతకుముందు రెజ్లర్ అవ్వాలని కలలుకన్న సుమిత్ ఈ ప్రమాదంతో పూర్తి నైరాశ్యంలోకి వెళ్లాడు. అయితే ఢిల్లీలోని రామ్జాస్ కళాశాలలో చదువుతున్న సమయంలో పారా క్రీడల గురించి తెలుసుకున్న సుమిత్.. జావెలిన్ త్రో వైపు అడుగులు వేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ టోక్యో పారాలింపిక్స్కు అర్హత సాధించిన సుమిత్ తొలి ప్రయత్నంలోనే బరిసెను 66.95 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (62.88 మీ.)ను బద్దలు కొట్టాడు. ఆ తర్వాత వరుసగా 68.08, 65.27, 66.71, 68.55 మీటర్ల దూరాన్ని నమోదుచేసి శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో సుమిత్ మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.
వినోద్కు దక్కని కాంస్యం
డిస్కస్ త్రో (ఎఫ్ 52) పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ వినోద్ కుమార్పై అనర్హత వేటుపడింది. ఆదివారం జరిగిన ఈవెంట్లో వినోద్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అయితే.. వినోద్ ఈ పోటీలకు అర్హుడు కాడని ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు పలితాలను నిలిపివే ఈ అంశాన్ని పరిశీలించిన నిర్వాహకులు.. సోమవారం వినోద్ను అనర్హుడిగా ప్రకటించారు. దీంతో పారాలింపిక్స్లో భారత్ ఓ పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పోటీల ప్రారంభానికి ముందు జరిగిన వర్గీకరణలో వినోద్ను ఎఫ్ 52 కేటగిరి ఇచ్చిన నిర్వాహకులు.. ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో ఇలా అనర్హుడిగా ప్రకటించడంతో అతడి పతక ఆశలపై నీళ్లు చల్లినైట్లెంది.
గురువు లేకుండానే..
డిస్కస్ త్రో (ఎఫ్ 56)లో యోగేశ్ కథూనియా ఆరో ప్రయత్నంలో డిస్క్ను 44.38 మీటర్ల దూరం విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బటిస్టా (బ్రెజిల్, 45.59 మీ.), డియాజ్ అల్డానా (క్యూబా, 43.36 మీ.) వరుసగా స్వర్ణ, కాంస్యాలు చేజిక్కించుకున్నారు. ఎనిమిదేండ్ల వయసులో పారాలిటిక్ ఎటాక్కు గురైన 24 ఏండ్ల యోగేశ్.. ఏడాది కాలంగా గురువు లేకుండానే శిక్షణ కొనసాగించడం గమనార్హం. పతకం నెగ్గిన అనంతరం యోగేశ్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ కారణంగా మైదానాలన్నీ మూతబడ్డాయి. కోచ్ లేకపోయినా సొంతంగానే శిక్షణ కొనసాగించా. గురువు లేకుండానే రజతం నెగ్గడం నిజంగా నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ పతకం 2024 పారిస్ క్రీడల్లో స్వర్ణం నెగ్గేందుకు ప్రేరణగా నిలుస్తుంది’ అని అన్నాడు.
ఝఝారియా తీన్మార్..
జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో బరిలోకి దిగిన దేవేంద్ర ఝఝారియా బరిసెను 64.35 మీటర్ల దూరం విసిరి రజతం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో దినేశ్ ప్రయన్ హెరాత్ (శ్రీలంక, 67.79 మీ.) స్వర్ణం చేజిక్కించుకోగా.. భారత్కే చెందిన సుందర్ సింగ్ గుర్జార్ 64.01 మీటర్ల దూరంతో కాంస్య పతకం గెలిచాడు. ఎనిమిదేండ్ల వయసులో విద్యుదాఘాతం వల్ల ఎడమ చేతిని కోల్పోయిన ఝఝారియా.. 2004, 2016 పారాలింపిక్స్లో స్వర్ణాలు సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా స్వర్ణం నెగ్గి పారాలింపిక్స్లో మూడో స్వర్ణాన్ని తన పేరిట రాసుకోవాలనుకున్న ఝఝారియా పోటీల అనంతరం మాట్లాడుతూ.. ‘క్రీడల్లో గెలుపొటమలు అత్యంత సహజం. స్వర్ణం నెగ్గాలనే పట్టుదలతో టోక్యోలో అడుగుపెట్టా. అందుకు తగ్గట్లే నా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశా. అయినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రజతంతో సంతృప్తిగా ఉన్నా’ అని అన్నాడు.
చదువు అబ్బకపోవడంతో..
రాజస్థాన్కు చెందిన సుందర్ సింగ్ గుర్జార్కు చిన్నప్పటి నుంచి ఆటలంటే అమితాసక్తి. క్రీడా మోజులో పడి చదువును అశ్రద్ధ చేస్తుండటం గమనించిన ఉపాధ్యాయులు ఆటలనే కెరీర్గా ఎంచుకోమని అతడికి సలహా ఇచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తూ.. స్పోర్ట్స్ హాస్టల్లో చోటు దక్కించుకున్న సుందర్ సింగ్తో విధి వింతనాటకం ఆడింది. అనుకోని ప్రమాదంలో చేతిని కోల్పోయిన సుందర్.. ఇక బతికి లాభం లేదని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ అదే సమయంలో పారా స్పోర్ట్స్ గురించి తెలుసుకున్న అతడు.. జావెలిన్ త్రోలో రాణిస్తూ మానసికంగా దృఢంగా మారాడు. ఎంపీ సైనీ శిక్షణలో రాటుదేలిన సుందర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరాడు.