పాట్నా: బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ తరఫున వైభవ్ బరిలోకి దిగాడు. దీంతో పిన్న వయసులో రంజీల్లో అరంగేట్రం చేసిన నాలుగో క్రికెటర్గా వైభవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఐదేండ్ల ప్రాయంలోనే క్రికెట్లోకి ప్రవేశించిన వైభవ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్కు ఆడిన వైభవ్.. జార్ఖండ్తో మ్యాచ్లో సెంచరీ(128 బంతుల్లో 151, 22ఫోర్లు, 3 సిక్స్లు)తో పాటు అర్ధసెంచరీ(76)తో కదంతొక్కాడు. భారత అండర్-19 ఏ, బీ జట్ల తరఫున వైభవ్ అదే జోరు కొనసాగించాడు. రహానే, శివమ్ దూబే, ధవల్ కులకర్ణి లాంటి స్టార్ క్రికెటర్లతో వైభవ్ కలిసి ఆడటం గర్వంగా భావిస్తున్నానని తండ్రి సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు.