Asia Cup | గతకొంతకాలంగా ఆసియాకప్, ప్రపంచకప్ విషయంలో పాక్ పెద్ద డ్రామా నడిపిస్తున్నది. ఇటీవల, హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించిన పీసీబీ.. తాజాగా టోర్నీ నిర్వహణపై రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. భారత జట్టు పాక్కు రాకపోతే.. ప్రపంచకప్లో పాక్ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని మొండిగా వాదిస్తున్నది. ఇటీవల పాక్ క్రీడాశాఖ మంత్రి అహ్సన్ మజారీ సైతం భారత జట్టు పాక్కు రాకుంటే.. మెగా టోర్నీకి పాక్ జట్టును పంపమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధీటుగా బదులిచ్చారు. ఏం జరిగినా టీమిండియా పాక్కు వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం సందర్భంగా ఆయన డర్బన్కు వెళ్లారు. గురువారం జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి చీఫ్ జకా అష్రఫ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. బీసీసీఐ సెక్రెటరీ పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్తో సమావేశమై ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు చేశారు. టోర్నమెంట్ ఇంతకు ముందు చర్చించిన విధంగానే కొనసాగుతుందన్నారు. లీగ్ రౌండ్లో పాకిస్థాన్తో నాలుగు మ్యాచ్లు జరుగనుండగా.. శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో పాక్, భారత్ మ్యాచులు రెండున్నాయి. ఇరు జట్లు ఫైనల్కు చేరితే మూడో మ్యాచ్ సైతం శ్రీలంకలోనే జరుగుతుంది. అయితే, ఆసియా కప్ కోసం భారత్ పొరుగుదేశానికి వెళ్తుందని.. పాక్ మీడియాలో వస్తున్న వార్తలను ధుమాల్ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేశారు. భారత్ పాక్కు వెళ్లడం లేదన్నారు. అయితే, ఆసియా కప్లో స్వదేశంలో కేవలం పాక్ ఒకే మ్యాచ్ ఆడనున్నది. అది కూడా నేపాల్ జట్టుతో ఆడతుంది. మిగతా మూడు మ్యాచ్లు బంగ్లాదేశ్-శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ – బంగ్లాదేశ్, శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్లు జరుగనున్నాయి.
వాస్తవానికి ఆసియా కప్ అతిథ్యంపై ఏడాదిగా వివాదం నడుస్తున్నది. టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం భారత్-పాక్ సంబంధాల నేపథ్యంలో టీమిండియా పాక్కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నది. ఈ క్రమంలో హైబ్రిడ్ మోడల్లో కప్ నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఆ తర్వాత అప్పటి నుంచి పీసీబీ డ్రామాకు తెరలేపింది. అప్పటి పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ప్రపంచకప్ కోసం భారత్కు రామని బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత పీసీబీ తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నజాం సేథి మొదట ససేమిరా అన్నా.. ఆ తర్వాత టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపారు. పాకిస్థాన్లో నాలుగు మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించగా, సూపర్ ఫోర్ సహా ఫైనల్తో సహా అన్ని మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత మళ్లీ పాక్ ప్రభుత్వం పీసీబీ చైర్మన్ను మార్చింది. ప్రస్తుతం ఇంకా కొత్త చైర్మన్ను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్ను విడుదల చేసింది.
అయితే, రెండు వేదికల విషయంలో కొర్రీలు పెడుతున్నది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘన్తో, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ల వేదికలను మార్చాలని పట్టుపట్టగా పీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ఆ తర్వాత పాక్ భద్రతా సమస్యలను లేవనెత్తింది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షాబాజ్ షరిఫ్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాజకీయ నాయకులకు మాత్రమే చోటు కల్పించారు. కమిటీలో క్రీడామంత్రి అహ్సన్ మజారీ సైతం ఉన్నారు. ఆసియా కప్ మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహిస్తే.. ప్రపంచకప్ మ్యాచ్లను సైతం తాము తటస్థ వేదిక నిర్వహించాలని డిమాండ్ చేశాడు. ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ విషయంపై ప్రస్తావించనున్నట్లు జాకా అష్రఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. ఒప్పందాన్ని వదులుకోదని, భారత్కు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆసియా కప్ ఆగస్టు 31న ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత్ మ్యాచులు మొదలవనున్నాయి.