Asia Cup 2023 : ఆసియా కప్లో స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాల కంటే వరుణుడే హైలెట్ అవుతున్నాడు. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మ్యాచ్తో పాటు నేపాల్, ఇండియా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగింది. అంతేకాదు సూపర్ 4(Super 4), ఫైనల్ మ్యాచ్లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అందుకని వరుణుడికి చెక్ పెట్టేందుకు జై షా(Jai Shah) నేతృత్వంలోని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది.
వర్ష సూచన లేని హంబన్టోటా(Hambantota) పట్టణంలో ఈ మ్యాచ్లు నిర్వహించాలని డిసైడ్ అయింది. అయితే.. అధికారిక ప్రకటన చేయడానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)తో ఏసీసీ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు వేదిక మార్చడానికి ఆమోదం తెలిపింది. కానీ, లంక దక్షిణ భాగాన ఉన్న హంబన్టోటాకు సిబ్బంది, ఆటగాళ్ల కిట్ను తరలించడం కొంచెం కష్టమే అని బ్రాడ్కాస్టింగ్ సంస్థలు అంటున్నాయి.
ప్రేమదాస స్టేడియంలో సెప్టెంబర్ 10న భారత్, పాకిస్థాన్ మ్యాచ్తో సూపర్ 4 సమరం షురూ కానుంది. ఈ టోర్నీలో దాయాదులకు ఇది రెండో మ్యాచ్. మొదటిసారి తలడినప్పుడు ఇండియా 266 పరుగులకు ఆలౌటయ్యింది. పాక్ పేస్ త్రయాన్ని దీటుగా ఎదుర్కొన్న ఇషాన్ కిషన్(82), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(87) జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ సారథి బాబర్ ఆజాం
అయితే.. పాక్ ఇన్నింగ్స్కు ముందు వాన మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)లో భారత్, పాక్ రెండు సార్లు ఎదురుపడ్డాయి. చెరొక మ్యాచ్లో గెలిచాయి.