Asia Cup | ఈ ఏడాది ఆసియా కప్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. అయితే, హైబ్రిడ్ మోడల్లో జరుగనుండగా.. కీలకమైన మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఆసియా కప్ టోర్నీ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో పాక్లో జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకావాలని బీసీసీఐకి పీసీబీ ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానాన్ని బీసీసీఐ అంగీకరించింది. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా లాహోర్కు వెళ్లనున్నారు. బీసీసీఐ సెక్రెటరీ జై షాతో సహా పలువురు కీలక అధికారులకు ఆహ్వానాలు అందినా.. ఇద్దరు మాత్రమే పాక్కు వెళ్లనున్నారు.
ఆసియా కప్ తొలి మ్యాచ్ ఈ నెల 30న పాక్ – నేపాల్ జట్ల మధ్య జరుగనున్నది. ఇదిలా ఉండగా.. టోర్నీలో భాగంగా భారత్ – పాక్ మధ్య సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగే మ్యాచ్కు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాతో కలిసి బీసీసీఐ సెక్రెటరీ జైషా హాజరుకానున్నారు. ఆ తర్వాత రోజు భారత్కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బిన్నీతో కలిసి రాజీవ్ శుక్లా వాఘా సరిహద్దు మీదుగా లాహోర్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇంతకు ముందు 2004లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని జట్టుతో కలిసి రాజీవ్ శుక్లా పాక్కు వెళ్లారు. సెప్టెంబన్ 4న లాహోర్లో పీసీబీ నిర్వహించనున్న అధికారిక విందు కోసం బిన్నీ, శుక్లాను పీసీబీ ఆహ్వానించింది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్ను జులై 19న జే షా ప్రకటించారు. ఆగస్టు 30న టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబరు 2న పాకిస్థాన్తో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్ ఉంది. ఇదే గ్రూప్లో పాకిస్థాన్, నేపాల్ జట్లు సైతం ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లోని మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 రౌండ్కు చేరుకుంటాయి. ఈ దశలో రాణించిన రెండు జట్లు నేరుగా ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.