Asia Cup | ఈ ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాక్ నుంచి టోర్నీని తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంకల్పింది. ఈ నెల 4న బహ్రెయిన్లో ఏసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప్ నిర్వహణపై చర్చ సాగింది. పాక్లో కాకుండా మరో వేదికపై టోర్నీ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అయితే, మార్చిలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఆతిథ్య హక్కులు తీసుకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని, అలాగే ఈ ఏడాదిలో భారత్లో జరిగే ప్రపంచకప్ నుంచి సైతం వైదొలగాలని పాక్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇప్పటికే ఆసియా కప్ను తటస్థ వేదికకు మార్చాలనే ఆలోచనపై పీసీబీ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాక్కు బదులుగా యూఏఈలో టోర్నీ నిర్వహించాలని ఏసీసీ భావిస్తుంది. ఇదే జరిగితే భారత్లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ నుంచి పాక్ వైదొలగే అవకాశాలున్నాయి. పీసీబీ డిమాండ్ మేరకు బహ్రెయిన్లో ఏసీసీ సమావేశం నిర్వహించింది. సమావేశానికి ముందు తమ నుంచి ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదని పీసీబీ చైర్మన్ నజాం సేథి ఆరోపించారు. అయితే దీనిపై ఏసీసీ ధీటుగా స్పందించింది. క్యాలెండర్ను పాక్ బోర్డుతో సహా మిగితా సభ్య దేశాలతో పంచుకున్నామని, అయితే పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఏసీసీ పేర్కొంది.
ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ ఆతిథ్యాన్ని పాక్కు అప్పగించారు. అయితే, భారత జట్టు పాక్లో పర్యటించబోదని ఏసీసీ చైర్మన్ జైషా అక్టోబర్తో పేర్కొన్నారు. అయితే, యూఏఈలోని దుబాయి, అబుదాబి, షార్జాలో నిర్వహించేందుకు ఏసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే పాక్ రూపాయి భారీగా పడిపోతున్నది. అలాంటి పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణకు ఏసీసీ చాలా ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అయితే, యూఏఈ కాకపోతే శ్రీలంకలోనూ నిర్వహించేందుకు ఏసీసీ ప్రయత్నాలు చేస్తున్నది. మరి టోర్నీ ఎక్కడ జరుగుతుందనే విషయం త్వరలోనే తేలనున్నది.