Asia Cup-2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. జైషా మాట్లాడుతూ పాక్కు వెళ్లేది లేనిది ప్రభుత్వం నిర్ణయిస్తుందని, కాబట్టి దానిపై తాము వ్యాఖ్యానించలేమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నమెంట్ను తటస్థ వేదికల్లో నిర్ణయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే, టీమిండియాను పాక్కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. బీసీసీఐ సెక్రెటరీ అయిన జైషా ఈ వార్తలను ఖండించారు. వచ్చే ఏడాది ఆసియాకప్ను పాక్లో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. 2023లో జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగనున్నది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ల్లో పాల్గొనడం లేదు. ఇరుదేశాల మధ్య చివరి టీ20, వన్డే సిరీస్ 2012 డిసెంబర్లో జరిగింది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్ను పాక్ 2-1తో కైవసం చేసుకున్నది. 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్లో పోటీపడింది లేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్లో పర్యటించలేదు. అదే సమయంలో నియంత్రణ రేఖ వెంట నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, 2019లో పుల్వామా దాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుజట్లు పోటీపడింది లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్లో మాత్రమే ఇరుజట్లు తలపడ్డాయి.