సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్.. ఐదు రోజుల క్రికెట్లో ఐసీసీ తొలిసారి తీసుకొచ్చిన చాంపియన్షిప్ ఇది. దీనికోసం రెండేళ్లపాటు సిరీస్లు నిర్వహించారు. చివరికి ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరి కప్పు కోసం ఫైట్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి ఫైనల్ మ్యాచ్కు వర్షం పదే పదే అడ్డుపడుతుండటం ప్లేయర్స్తోపాటు అభిమానులను కూడా అసహనానికి గురి చేస్తోంది. ఇప్పటికే రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మిగతా మూడు రోజులు కూడా పూర్తి ఆట సాధ్యం కాలేదు. రిజర్వ్ డే నిబంధనతో మ్యాచ్ ఆరో రోజు కూడా కొనసాగనుంది.
అయితే ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రిజర్వ్ డే అయిన బుధవారం గరిష్ఠంగా 98 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 64 పరుగులు చేసి 32 పరుగుల లీడ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు టాప్ టీమ్స్ మధ్య ఎవరో ఒకరే అసలు విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటారు.
అసలు టైమ్ పరిమితి లేకపోతే..
సాధారణంగా ఓ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు ఉంటుంది. ఇది ఫైనల్ కాబట్టి ఐసీసీ ఓ రిజర్వ్ డేను కేటాయించింది. అంటే ఇది ఆరు రోజుల మ్యాచ్. కానీ అసలు విజేతను తేల్చడానికి టైమ్ పరిమితి లేని మ్యాచ్ ఆడాలని అంటున్నాడు టీమిండియా స్పిన్నర్ అశ్విన్. ఎవరో ఒకరు గెలిచే వరకూ మ్యాచ్ను కొనసాగించాలన్నది అతని వాదన. వాతావరణాన్ని ఎవరూ నియంత్రించలేరు కానీ ఈ మ్యాచ్కో బహుమతి ఉంది కదా. అందుకే మ్యాచ్ ముగిసే వరకూ ఆడుతూ వెళ్తే బాగుంటుంది. కానీ అది సాధ్యమయ్యేలా లేదు అని అశ్విన్ అన్నాడు.
గతంలో ఇలా జరిగిందా?
నిజానికి క్రికెట్లో చివరిసారి ఇలా పరిమితి లేకుండా ఆడింది 1939లో. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ డర్బన్లో తలపడిన సమయంలో మ్యాచ్ 9 రోజుల పాటు సాగింది. మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ మొత్తం 12 రోజులు గడిచిపోయాయి. మ్యాచ్లో ఫలితం కోసమే ఇలా మ్యాచ్ కొనసాగించారు. అయినా చివరికి మ్యాచ్ మాత్రం డ్రాగానే ముగిసింది. దీనికి కారణం.. ఇంగ్లండ్ తిరిగి ఇంటికి వెళ్లిపోవడానికి బోటు సిద్ధంగా ఉంది. అది మిస్ చేసుకోకూడదని భావించిన ఇంగ్లండ్ టీమ్.. చివరికి మ్యాచ్ను అక్కడే ముగించి వెళ్లిపోయింది.