షార్జా: ఐపీఎల్ 14లో ఫైనల్ చేరాలని, అక్కడ చెన్నైపై పగతీర్చుకొని టైటిల్ గెలవాలని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగినరెండో క్వాలిఫైయర్లో కోల్కతా చేతిలో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ వేసిన వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ఐదో బంతికి భారీ సిక్స్ సమర్పించడంతో జట్టు ఓటమిపాలైంది. ఈ ఓవర్ గురించి టీమిండియా మాజీ సారధి, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించాడు.
అశ్విన్ తెలివైన బౌలర్ అని మెచ్చుకున్న సన్నీ.. చివర్లో అశ్విన్ అంచనా తప్పిందని అందుకే ఢిల్లీ ఓడిపోయిందని వివరించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కావల్సి ఉండగా కెప్టెన్ రిషభ్ పంత్ బంతిని అశ్విన్ చేతికి అందించాడు. అశ్విన్ కూడా తనపై కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.
ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు కూల్చాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో 6 పరుగులకు చేరింది. అశ్విన్ వేసిన ఓవర్ 5వ బంతిని రాహుల్ త్రిపాఠీ సిక్సర్గా మలచడంతో కోల్కతా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది.
‘‘అశ్విన్ చాలా తెలివైన బౌలర్. ఏ బ్యాట్స్మెన్కు ఎలాంటి బంతులేయాలో అతనికి బాగా తెలుసు. అతను బ్యాట్స్మెన్ మనసు చదువుతాడు. సునీల్ నరైన్ ముందుకొచ్చి బంతిని స్టాండ్స్లోకి పంపాలనుకుంటున్నాడని అశ్విన్ గ్రహించాడు. అందుకే వైడర్ డెలివరీ వేశాడు. దీంతో లాంగ్ ఆన్లో ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ చివరి బంతి వేసినప్పుడు అశ్విన్ లెక్క తప్పింది. త్రిపాఠి కూడా రన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు. అందుకే కొంచెం ఫ్లాట్గా బంతి వేశాడు. అయితే ఈ విషయాన్ని త్రిపాఠి కూడా గ్రహించాడు. దీంతో చివర్లో అద్భుతమైన షాట్ ఆడి మ్యాచ్ ముగించాడు’’ అని గవాస్కర్ వివరించాడు.
అయితే ఈ మ్యాచ్ ఇలా చివరి బంతి వరకూ రావడానికి కారణం కోల్కతా వైఫల్యమే అని విమర్శించాడు. కేకేఆర్ జట్టు మరో 10 బంతులుండగానే గెలవాల్సిన మ్యాచ్ను ఇలా చివరి బంతి వరకూ లాక్కొచ్చిందని లిటిల్ మాస్టర్ వెల్లడించాడు.