న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్లో సత్తాచాటుతానని భారత యువ స్కీయర్ అరిఫ్ ఖాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే నెల 4 నుంచి మొదలవుతున్న బీజింగ్ ఒలింపిక్స్లో అరిఫ్ ఖాన్ భారత్ తరఫున స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు. జమ్ముకశ్మీర్కు చెందిన అరిఫ్ గత కొన్నేండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్కీయింగ్ టోర్నీల్లో సత్తాచాటుతున్నాడు. ఈ యువ స్కీయర్ ప్రతిభను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడాశాఖ మెరుగైన శిక్షణ సౌకర్యాల కోసం ఇటీవలే ‘టాప్స్’ స్కీమ్ కింద రూ.17.46 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా అరిఫ్ మీడియాతో మాట్లాడుతూ ‘130 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రాతినిథ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు దేశానికి ఆడాలన్న నా కల నెరవేరబోతున్నది. వింటర్ ఒలింపిక్స్లో పోటీపడటం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలువాలనుకుంటున్నా. భారత్లోనూ స్కీయింగ్కు మంచి అవకాశాలు ఉన్నాయని నా ద్వారా తెలుస్తున్నది. మన దగ్గర పర్వతాలు ఉన్నాయి. రానున్న నాలుగైదు ఏండ్లలో గుల్మార్గ్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. జమ్ముకశ్మీర్ వింటర్ స్పోర్ట్స్కు కేంద్రంగా మారుతుంది. కశ్మీర్ ప్రజల మన్ననలు పొందటమే నా లక్ష్యం’ అని అరిఫ్ తెలిపాడు.