రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకెక్కాడు. జెంటిల్మన్ గేమ్కు మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ ఇద్దరు ఢిల్లీబాబులపై ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించగా.. విరాట్ కోహ్లీ దీన్ని సామాజిక మాధ్యమాల్లోకి తెచ్చి అగ్నికి ఆజ్యం పోశాడు. మరోవైపు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న గంభీర్.. తన సీనియారిటీని మరిచి వెకిలి చేష్టలతో విరాట్ను రెచ్చగొట్టడంతోనే ఇదంతా జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వాదానికి సంబంధించిన పూర్వాపరాలను ఓ సారి పరిశీలిస్తే..
Kohli Vs Gambhir | (నమస్తే తెలంగాణ క్రీడావిభాగం) ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు.. ఐపీఎల్ వేదికగా బయటపడ్డాయి. గతంలో బాహాటంగానే విమర్శించుకున్న భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ దీనికి వేదికైంది. మ్యాచ్ ఆసాంతం దూకుడుగా కనిపించిన కోహ్లీ.. లక్నో వికెట్లు కోల్పోతున్న ప్రతిసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ సందడిగా కనిపించాడు. ఇదే సమయంలో సిరాజ్, లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ మధ్య మాటల యుద్ధం సాగగా.. అక్కడికి వచ్చిన కోహ్లీ కూడా అందులో భాగస్వామి అయ్యాడు. వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభం కాగా.. మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న అమిత్ మిశ్రా.. కోహ్లీకి సర్దిచెప్పాడు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేయగా.. ఆ సమయంలో కోహ్లీ తనకు అలవాటైన రీతిలో ‘అతిగా’ సంబురాలు జరుపుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటున్న సమయంలో నవీన్కు విరాట్కు మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది.
అసలేం జరిగింది!
బహుమతి ప్రదానోత్సవానికి ముందు లక్నో ఓపెనర్ కైల్ మయేర్స్తో విరాట్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన గంభీర్.. మయేర్స్ను పక్కకు తీసుకెళ్లాడు. అదే సమయంలో ‘ఏం అంటున్నావో చెప్పు’ (క్యా బోల్ రహా హై బోల్) అని గంభీర్ అన్నాడు. దీనికి కోహ్లీ బదులిస్తూ.. ‘నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మీరెందుకు వస్తున్నారు’ (మైనే ఆప్కో కుచ్ బోలా హి నహీ, ఆప్ క్యూ ఘుస్ రహే హో) అని అన్నాడు. దీనికి గంభీర్ స్పందిస్తూ.. ‘నా జట్టు ఆటగాళ్లను అంటే నా కుటుంబ సభ్యులను అన్నట్లే’ అని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లీ.. ‘అయితే మీ కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచండి’ అని జవాబిచ్చాడు. చివరిగా గంభీర్ ‘అంటే ఇప్పుడు నువ్వు నాకు నేర్పుతావా’ అనే వ్యాఖ్యలు అన్నట్లు టీవీల్లో వినిపించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కేఎల్ రాహుల్, అమిత్ మిశ్రాతో పాటు ఇతర ఆటగాళ్లు ఇరువురికి సర్దిచెప్తూ పక్కకు తీసుకెళ్లారు.
100 శాతం జరిమానా
వాగ్వాదం నేపథ్యంలో కోహ్లీతో పాటు గంభీర్కు జరిమానా పడింది. సోమవారం బెంగళూరు, లక్నో మధ్య మ్యాచ్ అనంతరం వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు ఇద్దరి మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోడ్ ఆఫ్ కండక్ట్ 2.21 కింద ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరితో పాటు లక్నో బౌలర్ నవీన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.
తక్షణ కారణం..
తాజా సీజన్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 10న బెంగళూరులో జరిగిన పోరులో లక్నో చివరి బంతికి గట్టెక్కింది. ఆఖరి బాల్కు బైస్ రూపంలో పరుగు తీసిన అవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి కొట్టి సంబురాల్లో మునిగిపోగా.. లక్నో మెంటార్ గంభీర్ ప్రేక్షకులను నోరు మూసుకోమని సైగలు చేశాడు. ఈ ఘటన మనసులో పెట్టుకున్న ఆర్సీబీ స్టార్ కోహ్లీ.. సోమవారం మ్యాచ్లో ఫుల్ జోష్ కనబరిచాడు. లక్నో వికెట్ కోల్పోయిన ప్రతిసారి తనకు అలవాటైన రీతిలో ఆవేశంగా గాల్లోకి పంచ్లు విసురుతూ సంబురాలు చేసుకోవడంతో పాటు.. అభిమానులను మరింత సందడి చేయాలని కోరుతూ కనిపించాడు.
2013 నుంచి ఇదే తంతు..
గౌతమ్ గంభీర్ స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సమయంలో టీమ్ఇండియాలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత మాస్టర్ వారసుడిగా ఎదిగాడు. అయితే ఆరంభం నుంచి దూకుడు స్వభావం కలిగిన విరాట్.. మైదానంలో ప్రత్యర్థులను కవ్వించడంలో ఏమాత్రం వెనుకాడడు. సోమవారం మ్యాచ్లో కూడా 10వ నంబర్ ఆటగాడు నవీన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ పదే పదే అతడిని దూషించినట్లు అమిత్ మిశ్రా అంపైర్కు ఫిర్యాదు చేశాడు. కోహ్లీ, గంభీర్ మధ్య 2013 నుంచే అంత మంచి సంబంధాలు లేవు. ఆ సమయంలో కోహ్లీ బెంగళూరు కెప్టెన్గా ఉండగా.. గంభీర్ కోల్కతాకు సారథ్యం వహించాడు. ఆ సమయంలో ప్రారంభమైన మాటల యుద్ధం కొనసాగుతూ వస్తున్నది. క్రికెట్కు గుడ్బై చెప్పి వ్యాఖ్యాత అవతారమెత్తిన అనంతరం కూడా గంభీర్ పలుమార్లు బాహాటంగానే విరాట్ను విమర్శించాడు. మూడేండ్లు అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేయకపోతే కోహ్లీ తప్ప మరే ఆటగాడైనా జట్టుకు దూరమయ్యేవాడే అని వ్యాఖ్యానించాడు.
కొసమెరుపు
డిసెంబర్ 24, 2009.. భారత్, శ్రీలంక మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన లంక 315 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ విఫలం కాగా.. గౌతమ్ గంభీర్ (150 నాటౌట్) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అదే మ్యాచ్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ (107) వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం గంభీర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రకటించగా.. తొలి శతకం చేసిన విరాట్కు ఆ అవార్డు ఇవ్వాల్సిందిగా గంభీర్ కోరాడు.