IPL 2023 : పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేపటితో మొదలు కానుంది. ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు ఆరో టైటిల్పై కన్నేసింది. అయితే.. ఆ జట్టును గత కొంత కాలంగా మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. ఈ ప్రాబ్లమ్కు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(Anil Kumble) ఒక సలహా ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నాలుగో స్థానంలో ఆడాలని అతను అభిప్రాయపడ్డాడు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు.
‘ప్రస్తుత టీమ్లో ముంబైకి మిడిలార్డర్లో అనుభవమున్న ఆటగాడు ఎంతో అవసరం. అందుకని రోహత్ ఈసారి నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. అతను ఏడు నుంచి 15 ఓవర్లు క్రీజులో ఉండడం ముంబైకి ఎంతో ముఖ్యం’ అని కుంబ్లే తెలిపాడు. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో ముంబై జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో ఏప్రిల్ 2న తలపడనుంది.
పదిహేనో సీజన్లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశ పరిచింది. అన్ని విభాగాల్లో విఫలమైన రోహిత్ సేన ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. దాంతో, ఈసారి అద్భుతంగా రాణించాలని భావిస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్, బ్రెవిస్లతో బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది. అయితే.. స్పీడ్స్టర్ జస్పీత్ బుమ్రా సీజన్ మొత్తానికి దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద లోటు. ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్తో పాటు మిగతా బౌలర్లు రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 31న) ఐపీఎల్ పండుగ షురూ కానుంది. సాయంత్ర 5ః30 గంటల నుంచి ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.