కామన్వెల్త్ గేమ్స్-2022లో మరో బాక్సర్ భారత్కు పతకాన్ని ఖాయం చేశాడు. పురుషుల ఫ్లైవెయిట్ 51 (48-51 కేజీ) కిలోల విభాగంలో అమిత్ పంగల్ 5-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన లెన్నన్ ములింగన్ను మట్టికరిపించాడు. క్వార్టర్స్ పోరులో భాగంగా అమిత్.. స్కాట్లాండ్ బాక్సర్పై ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ విజయంతో అమిత్ సెమీస్ చేరాడు.
ఇప్పటికే భారత బాక్సర్లు నిఖత్ జరీన్, నీతు గంగాస్, మహ్మద్ హుసాముద్దీన్ లు సెమీస్కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు అమిత్ కూడా చేరాడు. ఈ నలుగురు సెమీస్ బౌట్లో నెగ్గితే పతకం రంగు కూడా మారనుంది.
ఇక అథ్లెటిక్స్లో భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్.. మహిళల 200 మీటర్ల ఈవెంట్లో సెమీస్కు అర్హత సాధించింది. గురువారం జరిగిన 200 మీటర్ల హీట్ను ఆమె 23.42 సెకన్లలోనే పూర్తి చేసింది. తద్వారా సెమీస్లోకి ప్రవేశించింది.
మరోవైపు బ్యాడ్మింటన్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణం చేజారినా వ్యక్తిగత ఈవెంట్లలో మన షట్లర్లు దూసుకుపోతున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు.. ప్రి క్వార్టర్స్ చేరింది. గురువారం జరిగిన 32వ రౌండ్ పోటీలో సింధు.. 21-4, 21-11 తేడాతో మాల్దీవ్స్ షట్లర్ ఫాతిమా నబా అబ్దుల్ రజాక్ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్.. 21-9, 21-9 తో వానాగలియా (ఉగండా)ను ఓడించి ప్రి క్వార్టర్స్కు అర్హత సాధించాడు.