శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగిస్తున్నారు. జనాగ్రహం చూసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం వేకువ జామున లంకను వీడాడని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే దేశంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) ని విధించారు. తాజా పరిణామాలతో అక్కడ త్వరలో జరగాల్సి ఉన్న రెండు కీలక సిరీస్ లు జరుగుతాయా..? లేదా..? అనే అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
శ్రీలంకలో ఈ నెల 16 నుంచి 24 వరకు గాలే, కొలంబో వేదికగా పాకిస్తాన్ జట్టు ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతో పాటు వచ్చే నెలలో లంకలో ఆసియా కప్ కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ రెండూ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమచారం.
ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ప్రారంభం కావల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం లంకలో కాకుండా బంగ్లాదేశ్ లో ఆసియా కప్ నిర్వహణ కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇదే విషయమై ఏసీసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము బంగ్లాదేశ్ ను స్టాండ్ బై ఆప్షన్ గా పెట్టుకున్నామని ఆ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు.
ఇక శ్రీలంక-పాకిస్తాన్ సిరీస్ గురించి నేడో, రేపో కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో సిరీస్ నిర్వహణ కష్టమనేది లంక క్రికెట్ బోర్డుకు కూడా తెలుసు. కానీ ప్రస్తుతం దానికి సిరీస్ ఉపసంహరించుకోవడం తప్ప మరో గత్యంతరం కూడా లేదు.