న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్పై లైంగిక దాడి ఆరోపణలు చేసిన రెజ్లర్లు ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటీషన్ను స్వీకరించింది. రెజ్లర్లు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ కేసును శుక్రవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
రెజ్లర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసును వాదిస్తున్నారు. ఆరోపణలు చేసిన ఏడు మంది రెజ్లర్లలో ఓ మైనర్ ఉన్నట్లు పిటిషన్లో తెలిపారు. బ్రిజ్ భూషణ్పై కమిటీ ఓ రిపోర్టును తయారు చేసిందని, దాన్ని ఇంకా పబ్లిక్ చేయలేదని, ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సిబల్ వాదించారు. మైనర్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, ఆ అమ్మాయి దేశానికి స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చిందన్నారు.
ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చినట్లు రెజ్లర్ల తరపున న్యాయవాది తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ప్రస్తుతం ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.