బిర్యానీ అనగానే గుర్తుకొచ్చేది ‘దమ్ బిర్యానీ’. చికెన్,మటన్ బిర్యానీలంటే మాంసాహార ప్రియులకు మహా ఇష్టం. మరి, శాకాహారుల సంగతేంటి? వెజ్ బిర్యానీతో సర్దుకు పోవాల్సిందేనా? క్యారెట్ ముక్కలతో రాజీ పడాల్సిందేనా? ఆ తేడా తెలియకుండా వెజ్జీలకు మాంసాహార రుచిని అందించేదే మష్రూమ్ బిర్యానీ.
ఇప్పుడంటే, మష్రూమ్స్ అంటూ మహా డాబుగా పిలుస్తున్నారు కానీ, తెలంగాణ పల్లెలకు సంబంధించినంత వరకూ అవి పుట్టగొడుగులే. ప్రాచీనకాలం నుంచీ ఆదివాసీల ఆహారంలో ఇవి ఒక భాగం. క్రమంగా గ్రామాలకూ, పట్టణాలకూ, నగరాలకూ విస్తరించాయి. ఇప్పుడు మష్రూమ్స్ పక్కా ఫైవ్స్టార్ దినుసులు!
పుట ్టగొడుగులు పోషకాల్లో, రుచిలో చికెన్, మటన్లకు తీసిపోవు. అందుకే, ‘శాకాహారుల మాంసం’గా దీనిని పిలుస్తారు. లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, సాజీర వంటి మసాలా పదార్థాలతోపాటు మష్రూమ్స్ జోడించి బిర్యానీ వండుతారు. అయితే, బిర్యానీ కోసం మేలు రకం మష్రూమ్స్ ఎంచుకోవడం ముఖ్యం. బోర్లించిన గిన్నె ఆకారంలో ఉండేవాటిని నిలువుగా ముక్కలు చేస్తే, లోపలి భాగానికి మసాలా బాగా పడుతుంది.
పుట్ట గొడుగుల్లోని ఇర్గోథియోనైన్, సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డీఎన్ఏను దెబ్బ తీస్తూ గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ను సమర్థంగా ఎదుర్కొంటాయి.
రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు పుట్ట గొడుగులను బాగా తినాలంటారు పోషకాహార నిపుణులు. సగం కప్పు పుట్ట గొడుగుల్లో కేవలం తొమ్మిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఉడికించినవైతే ఇరవై కాలరీలను అందిస్తాయి. అంతేకాదు, వీటిలో 80-90 శాతం నీరే ఉండటం వల్ల రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వులు కరిగి, రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఇందులోని పొటాషియం పక్షవాతం ముప్పును అరికడుతుంది. రైబోఫ్లెవిన్, నియాసిన్లు శరీరంలోని విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. విటమిన్ ‘ఇ’, సెలీనియం ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
అలా అని, ఎక్కడ పడితే అక్కడ దొరికే పుట్ట గొడుగులను తినకూడదు. అడవుల్లో పెరిగే పుట్ట గొడుగుల్లో విషపూరితమైనవి కూడా ఉంటాయి. కనుక, సాగు పద్ధతిలో పండించిన వాటినే ఎంచుకోవడం మంచిది. మిగిలిన వాటితో పోలిస్తే, తెలుపు రంగు పుట్ట గొడుగులు అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతారు.