గతేడాది ఇంగ్లండ్ తో అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకేకు వెళ్లిన టీమిండియా క్యాంప్ లో కరోనా కలవరం మొదలైంది. ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు భారత జట్టు లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగా.. దానికంటే ముందే టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.
భారత జట్టు ఇంగ్లండ్ కు బయల్దేరడానికంటే ముందే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్ గా తేలిందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లాడు కోహ్లి. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత విరాట్ కు కొవిడ్-19 పాజిటివ్ గా తేలిందని, అయితే ఆ తర్వాత అతడు కోలుకుని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇంగ్లండ్ కు వెళ్లడానికంటే ముందు భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా కరోనా సోకడంతో అతడు ఆలస్యంగా వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.
అశ్విన్, కోహ్లిలతో పాటు మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లకు కూడా వైరస్ సోకినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీమ్ మేనేజ్మెంట్ అధికారిక ప్రకటనేదీ విడుదల చేయలేదు. కానీ ఇంగ్లండ్ కు వెళ్లిన తర్వాత కోహ్లితో పాటు రోహిత్ శర్మ లు యూకే వీదుల్లో షాపింగ్ లకు తిరగడం.. మాస్కులు లేకుండానే బయట కనిపించడంతో ఈ రూమర్లకు ఆజ్యం పోసినట్టైంది.
ఇక తాజాగా వీరిద్దరితో కలిసి మెలిగిన మరికొందరు క్రికెటర్లు కరోనా బారినపడ్డారని వీరిలో పలువురు జూన్ 24 నుంచి లీస్టర్షైర్ తో మ్యాచ్ ఆడటం కష్టమేనని తెలుస్తున్నది. జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ఇంగ్లండ్ తో భారత జట్టు ఐదో టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే.