భిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, వేలాది భాషలు, లక్షల ఆచారాలు కలిగిన భారతదేశంలో క్రికెట్ సైతం ఒక మతంగా కీర్తించబడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశాన్ని ‘సమైక్యంగా’ ఉంచడంలో అన్ని క్రీడల మాదిరిగానే క్రికెట్ పోషిస్తున్న పాత్ర తక్కువేమీ కాదు. భారత్లో క్రికెట్కు అంతలా క్రేజ్ ఉంది కాబట్టే ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
అయితే భారత్తో పాటు క్రికెట్కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో ఎంత క్రేజ్ ఉన్నా ఈ క్రీడ ‘విశ్వవ్యాప్తం’ కాలేదన్నది కళ్ల ముందు కనబడుతున్న సత్యం. ఈ లోటును భర్తీ చేసి క్రికెట్ను సైతం ‘ప్రపంచ క్రీడ’గా మార్చేందుకు అత్యున్నత క్రికెట్ మండలి ఐసీసీ చేస్తున్న చిన్న ప్రయత్నం ‘కామన్వెల్త్’ క్రీడలతో మొదలవబోతున్నది.
చరిత్రలోకి వెళ్తే..
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలలో ఈసారి క్రికెట్ను చేర్చారు. అయితే కామన్వెల్త్లో క్రికెట్ను చేర్చడం ఇదే కొత్త కాదు. గతంలో 1998 కౌలాలంపూర్ (మలేషియా)లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ను చేర్చారు. క్రికెట్ ఆడే దేశాలన్నీ ఒకనాడు బ్రిటీష్ పాలన కింద ఉన్నవే గనక ఈ క్రీడను కూడా ఆడించారు. వన్డే ఫార్మాట్ (పురుషుల)లో 16 జట్లు పాల్గొన్న ఆ క్రీడలలో దక్షిణాఫ్రికా స్వర్ణం నెగ్గగా ఆస్ట్రేలియా రజతం, న్యూజిలాండ్ కాంస్యం గెలిచింది. ఈ క్రీడలలో భారత్ పాల్గొన్నా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. కారణాలేవైనా ఆ తర్వాత కామన్వెల్త్లో క్రికెట్ను ఆడించలేదు.
అసలు లక్ష్యమదే..
24 ఏండ్ల తర్వాత మళ్లీ ఐసీసీ పట్టుబట్టి కామన్వెల్త్లో క్రికెట్ను చేర్పించింది. పురుషుల జట్లన్నీ ఇప్పటికే తమకున్న షెడ్యూల్తో బిజీగా గడుపుతుండటంతో మహిళల క్రికెట్ను మాత్రమే ఇందులో ఆడిస్తున్నారు. ఆధునిక క్రికెట్లో బహుళ ప్రజాధరణ పొందిన టీ20 ఫార్మాట్లో ఆడుతున్న ‘ఈ ఆటలు’ ఐసీసీకి ఎంతో కీలకం. 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఎలాగైనా సరే క్రికెట్ను చేర్చాలనే లక్ష్యంతో ఉన్న ఐసీసీకి కామన్వెల్త్లో క్రికెట్ను విజయవంతం చేయడం అత్యంత ఆవశ్యకం. ఇవి విజయవంతమైతేనే లాస్ ఏంజెల్స్లో క్రికెట్ను చేర్చే యత్నాలు ఊపందుకుంటాయి. 1900లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్ను ఆడించారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్-ఫ్రాన్స్ మాత్రమే ఆ క్రీడల్లో పాల్గొన్నాయి. ఆ తర్వాత దీనిని మళ్లీ ఒలింపిక్స్లో ఆడించలేదు.
ఈసారి ఎలా..?
ఎన్ని వన్డే, టీ20 ప్రపంచకప్పులు జరిగినా ఐసీసీ మెగా ఈవెంట్లలో పాల్గొన్నా క్రికెట్ అనేది ఇప్పటికీ ఓ పదిహేను (గట్టిగా చెప్తే పది దేశాలే) దేశాలకే పరిమితమైంది. విశ్వక్రీడా వేదికలపై క్రికెట్ను ఆడించి ఈ ఆటను విశ్వవ్యాప్తం చేయడానికి జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా.. కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ను చేర్చిన ఐసీసీ.. 8 దేశాలతో ఈ ఆటను ఆడిస్తున్నది. గ్రూప్-ఏ లో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బోడస్ ఉండగా గ్రూప్-బిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంకలు ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు మ్యాచులు ఆడుతుంది. రెండు గ్రూపుల్లో టాప్-2గా నిలిచిన జట్లు నాకౌట్ చేరతాయి. జులై 29 నుంచి గ్రూప్ మ్యాచ్లు ఆగస్టు 4వరకు జరుగుతాయి. ఇక ఆగస్టు 6న తొలి సెమీస్, రెండో సెమీస్ జరుగుతాయి. 7న కాంస్యంతో పాటు స్వర్ణ-రజత విజేతలు పోటీ పడతారు.
తొలి మ్యాచ్ మనదే..
రెండు గ్రూపుల్లో భాగంగా తొలి మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్యే జరుగబోతున్నది. ఇక దాయాది దేశం పాకిస్తాన్తో జులై 31న మ్యాచ్ ఆడనుంది భారత్.