Shreyas Iyer – Ishan Kishan | జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలని మొత్తుకున్నా వినకుండా ఇగోకు పోయిన భారత యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వాటిని కోల్పోయారు. ఒక్క సెంట్రల్ కాంట్రాక్టులు పోతే ఏముంది..? మ్యాచ్లలో ఆడొచ్చు కదా..? అనుకుంటే కుదరదు. సెంట్రల్ కాంట్రాక్టులు లేకుంటే అయ్యర్ – కిషన్లు ఈ కింది వసతులు కోల్పోతారు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో నాలుగు గ్రేడ్లు ఉంటాయన్న విషయం విదితమే. గ్రేడ్ ఏ+, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సిలుగా ఉండే వీటిలో క్రికెటర్లకు వార్షిక వేతనం కింద గ్రేడ్ ఏ+ క్రికెటర్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి ప్లేయర్లకు రూ. 3 కోట్లు దక్కనుండగా గ్రేడ్ సి ఉన్నవారికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టులు కోల్పోగానే ఇషాన్, అయ్యర్లు ఇవి ఆర్జించే అవకాశాన్ని కోల్పోయారు.
డబ్బు విషయం పక్కనబెడితే క్రికెటర్లకు గాయాలైనప్పుడు బీసీసీఐ.. వారిని వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చేర్పించి వారికి తగిన చికిత్స అందిస్తుంది. అంతేగాక అక్కడి వసతులన్నింటినీ క్రికెటర్లు ఉచితంగానే వాడుకోవచ్చు. ఉదాహరణకు 14 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్.. చాలాకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. అతడికి బీసీసీఐ కాంట్రాక్టు ఉండటంతోనే ఇది సాధ్యమైంది. అయితే కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్, అయ్యర్లు మాత్రం ఎన్సీఏలో డైరెక్ట్ ఎంట్రీ కుదరదు. వీళ్లు ఏదైనా గాయమైనా, రిహాబిటేషన్ కోసం వెళ్లాలన్నా వాళ్లు ప్రాతినిథ్యం వహించే స్టేట్ అసోసియేషన్ల నుంచి లేఖలు తీసుకుని వాటిని ఎన్సీఏకు అందిస్తే అప్పుడు అక్కడ వసతులను పొందొచ్చు.
అంతేగాక సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ ఇన్సురెన్స్తో పాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ను కూడా భరిస్తోంది. పంత్ వైద్య ఖర్చులను బీసీసీఐ భరించింది. గతేడాది కేఎల్ రాహుల్ జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నా, ఇటీవలే మహ్మద్ షమీ లండన్లో చికిత్స చేయించుకున్నా వాటిని ఆటగాళ్లు భరించాల్సిన అవసరం లేదు. కానీ కాంట్రాక్టు లేని ఆటగాళ్లు మాత్రం వారి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలి.