ఢిల్లీ: సంచలనాల ఆఫ్ఘానిస్థాన్ టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసును సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఓడి రెండో పోరులో విజయానికి దగ్గరగా వచ్చినా ‘సూపర్ ఓవర్’ ఫలితంతో నిరాశచెందిన రషీద్ ఖాన్ సేన.. ఎట్టకేలకు తమ మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఢిల్లీ వేదికగా జరిగిన గ్రూప్-డీ మ్యాచ్లో కాబూలీలు.. 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలిచారు. అజ్మతుల్లా ఒమర్జయ్ ఆల్రౌండ్ ప్రదర్శన (మొదట బంతితో 4/15, ఆ తర్వాత బ్యాట్తో 21 బంతుల్లో 40 నాటౌట్) తో రాణించి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నిర్ణీత ఓవర్లకు 160/9కే పరిమితమైంది. సోహైబ్ ఖాన్ (48 బంతుల్లో 68, 6 ఫోర్లు, 4 సిక్స్లు), అలిషాన్ షరాఫు (31 బంతుల్లో 40) ఆ జట్టును ఆదుకున్నారు. ఛేదనలో ఆఫ్ఘాన్ కూడా తడబడింది. గుర్బాజ్ డకౌట్ అవగా జద్రాన్ (41 బంతుల్లో 53) నెమ్మదిగా ఆడాడు. ఆఖరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 28 పరుగుల అవసరమన్న దశలో ఒమర్జయ్ మెరుపులు మెరిపించి ఆఫ్ఘాన్కు తొలి విజయాన్ని అందించాడు.
టీ20ల్లో ఆఫ్ఘాన్ సారథి రషీద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 700 వికెట్లు తీసుకున్న మొదటి బౌలర్గా అతడు రికార్డులకెక్కాడు. యూఏఈతో మ్యాచ్లో అర్ఫాన్ వికెట్ తీయడంతో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో రషీద్ తర్వాత అత్యధిక వికెట్లు తీసినవారిలో విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో (631) రెండో స్థానంలో ఉన్నాడు.