Ramadan | అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అఫ్గాన్ క్రికెట్ జట్టు సారథి హష్మతుల్లా షాహిది, ఆల్ రౌండర్ మహ్మద్ నబీలు మ్యాచ్ జరుగుతుండగానే ఫీల్డ్లోనే ఉపవాస దీక్ష విరమించారు. ముస్లిములు అత్యంత పవిత్రమాసంగా భావించే రంజాన్ మాసం ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. అఫ్గాన్ క్రికెటర్లు కూడా ఐర్లాండ్తో మ్యాచ్ జరుగుతున్న క్రమంలోనే కొంతసేపు విరామం తీసుకుని ఉపవాసాన్ని విరమించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మ్యాచ్లో భాగంగా అఫ్గానిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆట 40 ఓవర్ల ఆట ముగిసేసరికి సాయంత్రం 6 గంటలు దాటింది. అదే సమయానికి క్రీజులో ఉన్న హష్మతుల్లా – నబీలు ఇఫ్తార్ విందు కోసం కొంతసేపు విరామం తీసుకున్నారు. సహచర ఆటగాళ్లు ప్లేట్లో తీసుకొచ్చిన ఖర్జూర పండ్లను తిని ఉపవాస దీక్షను విరమించారు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో అఫ్గాన్ క్రికెటర్లు కూడా ఇఫ్తార్ విందు ఆరగించారు. గతంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ప్రార్థనలు చేసుకోగా తాజాగా అఫ్గాన్ ప్లేయర్లు మ్యాచ్ మధ్యలోనే విందును పూర్తిచేశారు.
— Cric guy (@Cricguy88) March 13, 2024
షార్జా వేదికగా ముగిసిన మూడో వన్డేలో అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. గుర్బాజ్ (51), షాహిది (69), నబీ (48)లు రాణించారు. అనంతరం స్వల్ప ఛేదనలో ఐర్లాండ్.. 35 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ పాల్ స్టిర్టింగ్ (50), కర్టిస్ కంఫర్ (43)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. మహ్మద్ నబీ ఐదు వికెట్లు పడగొట్టగా నంగ్యల్ కరోటి నాలుగు వికెట్లు తీశాడు.
Winning Moments 👏#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/YV8F711qei
— Afghanistan Cricket Board (@ACBofficials) March 12, 2024