సూర్యాపేట, మార్చి31 : గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో జవాబుదారీతనం ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పల్లె ప్రకృతి పనులు, ఉపాధిహామీ పనులపై కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ సంజీవరావుతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు అంకిత భావంతో పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఆ దిశగా అధికారులు కృషి చేసి సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపటి నుంచి ఉపాధి పనుల్లో ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పని చేసేలా చూడాలన్నారు. వచ్చే హరితహారం నాటికి మొక్కలు సిద్ధం చేయాలని, గ్రామాల్లో ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని, పంట కల్లాల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు.
652 ప్రకృతి వనాలు పూర్తి
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 679 పల్లె ప్రకృతి వనాలు ఉండగా ఇప్పటి వరకు 652 పూర్తి చేసినట్లు తెలిపారు. 10 రోజుల్లో మిగిలిన 27 వనాలు పూర్తి చేస్తామన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు 471 పూర్తి కాగా మరో 4 షెడ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 301 వైకుంఠధామాలు పూర్తి చేశామని, మిగిలిన 174 మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం డీఆర్డీఏ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందీప్కుమార్ సుల్తానియా పరిశీలించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి కిరణ్కుమార్, డీపీఓ యాదయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.