T20 Worldcup Team India | ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న భారత్ను ఒక ప్రశ్న వేధిస్తోంది. అదేంటంటే భారత జట్టు ఓపెనర్లుగా ఎవరిని ఆడించాలి? సరైన జోడీ కుదరక ఈ ప్రశ్న తలెత్తడంలేదు. ఓపెనింగ్ చేయడానికి అద్భుతమైన ఆప్షన్లు ఉండటంతోనే ఈ తలనొప్పి.
ఓపెనర్గా రోహిత్ను పక్కన పెట్టాలని ఎవరూ భావించడం లేదు. అయితే అతని జోడీగా ఎవరిని దింపాలన్నదే సమస్యగా మారింది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ ఇలా ఏ జోడీని దింపాలని టీమిండియా శిబిరంలో పెద్ద చర్చే జరుగుతోంది.
అయితే రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీకే భారత జట్టు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. రోహిత్, విరాట్ ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారని, వారిని ఓపెనర్లుగా పంపాలని అనుకోవడం తప్పేమీ కాదని చోప్రా అన్నాడు.
అయితే వీరిద్దరితో పోల్చుకుంటే రాహుల్ అసాధారణ ఫామ్లో ఉన్నాడని, కాబట్టి కచ్చితంగా అతన్ని ఓపెనింగ్లో దింపాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. కోహ్లీని మూడో స్థానంలో పంపాలని సూచించాడు.
‘‘దయచేసి రోహిత్, రాహుల్తో ఓపెనింగ్ చేయించండి’’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో చేసిన విశ్లేషణలో టీమిండియా మేనేజ్మెంట్కు సూచన చేశాడు. అలాగే బౌలింగ్ చేయకపోతే పాండ్యాను 11 మందిలో తీసుకోవడం వల్ల ఉపయోగం లేదని కూడా చెప్పాడు.
అతను బౌలింగ్ కూడా చేస్తేనా భారత జట్టుకు మేలు జరుగుతుందని వివరించాడు. రెండు వార్మప్ మ్యాచుల్లో అతని ప్రదర్శన చూసిన తర్వాతే 11 మందిలో అతని స్థానం గురించి చర్చించాలని పేర్కొన్నాడు.