ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్టాపిక్గా మారిన అంశం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏదిఏమైనా టీ20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తొలగించింది.
దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇటీవల మాట్లాడుతూ.. కోహ్లీని టీ20 సారధ్యం వదులుకోవద్దని కోరినా అతనువ వినలేదని, ఈ క్రమంలోనే వైట్బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్ల అవసరం లేదని సెలెక్టర్లు భావించారని వివరణ ఇచ్చాడు. ఇటీవల ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా గంగూలీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టిఫార్మాట్ కెప్టెన్సీ వదిలేయాలని కోహ్లీ నిర్ణయించుకున్నప్పుడు తాను స్వయంగా అతనితో మాట్లాడానని గంగూలీ చెప్పాడు. కెప్టెన్సీ వదులుకోవద్దని కోరానన్నాడు. ‘కోహ్లీ చాలాకాలం జట్టుకు సారధ్యం వహించాడు. అతనిపై పనిభారం పెరిగినట్లు భావించాడు. పర్లేదు, అతనో గొప్ప క్రికెటర్. ఎక్కువ కాలం సారధ్యం వహిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. నేను కూడా చాలా కాలం కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాను కాబట్టి నాకీ విషయాలు తెలుసు’ అని గంగూలీ అన్నాడు.
అలాగే వైట్బాల్ క్రికెట్లో ఒకే కెప్టెన్ ఉండాలని సెలెక్టర్లు భావించారని, అది సరైన నిర్ణయమేనని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో ఏమవుతుందో తాను చెప్పలేనని, అయితే ఇది చాలా మంచి జట్టని ఇందులో అద్భుతమైన ఆటగాళ్లున్నారని అన్నాడు.
ప్రస్తుత పరిస్థితులను ఈ జట్టు సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని తాను ఆశిస్తున్నానని చెప్పిన గంగూలీ.. ఒక మంచి జట్టులో ఎక్కువ మంది నాయకులు ఉండరని తేల్చిచెప్పాడు. ఈ నెలాఖరున జరిగే సౌతాఫ్రికా టూర్ నుంచి వన్డే, టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తించనున్న సంగతి తెలిసిందే.