సిద్దిపేట : తెలంగాణలో టీడీపీ పార్టీనీ ప్రజలు ఆదరించరని, ఆపార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్, వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేటితో సిద్దిపేటలో టీడీపీ పార్టీ ఖాళీ అయిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో పెను మార్పులు వచ్చాయి. తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణగా మారిందని పేర్కొన్నారు.
జిల్లాలో గోదావరి జలాలతో రూ.1600కోట్ల విలువ గల పంటలు పండుతున్నాయి. ఒకనాడు కాలం కాక కరువుతో పట్టణంలో అంబలి కేంద్రం ఏర్పాటు పెట్టుకునేవాళ్లం. నేడు పసిడి పంటలు పండుతున్నాయని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 18సార్లు పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని మండిపడ్డారు. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్ లో రూ.25వేల కోట్లు కోత పెట్టింది. బీజేపీ నాయకులపై కేసులు పెడుతూ లోంగదీసుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి ఆరోపించారు.