సిద్దిపేట జోన్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని, సిటీ స్కానింగ్ రేట్లను రూ.5500కు బదులు రూ.2 వేలు మాత్రమే తీసుకునేందుకు సీటీ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు అంగీకరించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను మంత్రి అభినందించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సాధ్యమైనంత త్వరలో సిద్దిపేట జిల్లాలోని కొవిడ్ దవాఖానలను తనిఖీ చేసి, బాధితులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకుంటానన్నారు. కొవిడ్ దవాఖానలుగా మారిన అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ బాధితులకు వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్, రెమిడిసివర్ కొరత లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఏమైనా పెండింగ్ బిల్లులుంటే, తన దృష్టికి తెస్తే, 24గంటల్లో పరిష్కరిస్తారన్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా సిద్దిపేటకు మందులు..
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు అవసరమైన మందులు సంగారెడ్డి సెంట్రల్ స్టోర్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి నేరుగా అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అంగీకరించారని మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోనే సిద్దిపేటలో సెంట్రల్ స్టోర్ ఏర్పాటుకు కూడా సమ్మతిని తెలిపారన్నారు. కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు చొరవతో జిల్లాలో ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ లేవన్నారు. గత వారంతో పోల్చితే ఈ వారం పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతుందన్నారు. పెరుగుతున్న పేషెంట్ల దృష్ట్యా జిల్లాలో ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు, రిటైర్డ్ వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని నియమించుకుంటే రిటైర్డ్ అధికారుల అనుభవాలు ఆసుపత్రులకు ఉపయోగపడుతాయన్నారు.