సిద్దిపేట,మే 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రజాప్రతనిధులు చొరవ చూపాలి.. ఐసొలేషన్లో ఉన్న వారికి మనో ధైర్యం నింపాలి’.. అని మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం రాత్రి సిద్దిపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లతో పాటు ప్రస్తుతం 250 బెడ్స్ అందుబాటులో ఉన్నాయిని వివరించారు. ఎవరికైన ఆక్సిజన్ అవసరం ఉంటే సిద్దిపేట మెడికల్ కళాశాలకు పంపాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలకు ఈ విషయంపై పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో హోం ఐసొలేషన్లో ఉన్న వారికి మెడికల్ కిట్ అందజేయాలన్నారు. వారికి అవసరమైన సహయ సహకారాలను అందించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. లాక్డౌన్లో వ్యవసాయ రంగానికి మినహాయింపు ఉందనీ, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు.
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ ఎంపీపీలు, జడ్పీటీసీలు సందర్శించి, సమస్యలుంటే వేంటనే పరిష్కరించాలన్నారు. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని, ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవవాలన్నారు. ప్రతి సెంటర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలని చెప్పారు. వర్షాలు పడక ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాల్వల్లో పేరుకపోయిన మట్టి, పిచ్చి చెట్లు ఉపాధిహామీ పథకంలో చేపట్టాన్నారు. ఆయా గ్రామాల్లో కాల్వలను గుర్తించి అందుకు అనుగుణంగా అధికారులతో సమన్వయం చేసుకుంటే పనులు చేపట్టాలన్నారు. చెరువుల పూడికతీత పనులు కూడా చేపట్టాలన్నారు. వర్షాలు పడేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే వర్షం పడ్డ ప్రతి నీటి బొట్టు చెరువులోకి వెళ్తుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్రావు సూచించారు.