సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కలెక్టర్ వెంకట్రామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, డీఎంహెచ్వోలతో మంత్రి అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. అదే విధంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు, కోవిడ్ వార్డు ఇంచార్జులతో సమీక్షించారు.
సిద్దిపేట జిల్లాలో పోలీసులు, వైద్య, రెవెన్యూ, పారిశుధ్య కార్మిక సిబ్బందికి 96 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయ్యిందన్నారు. మిగితా వారు కూడా రెండు రోజుల్లో ఫస్ట్ డోస్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఫ్రంట్లైన్ వర్కర్లంతా తిరిగి నూటికి నూరు శాతం రెండవ డోస్ తీసుకోవాలన్నారు. ఇక 45 ఏళ్లు పైబడిన వారు జిల్లాలో 1లక్షా 60వేల మంది ఉండగా ఇందులో 1లక్షా 40వేల మంది టీకా వేసుకున్నారని వివరించారు. ఇంకా 20 వేల మంది మిగిలారని, వీరితో పాటు 11వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అవసరం ఉందని డీఎంహెచ్వో చెప్పడంతో మంత్రి హరీశ్రావు వెంటనే స్పందించారు. ఫామిలీ వెల్ఫేర్ హెల్త్ సెక్రటరీ వాకాటి కరుణకు ఫోన్ చేసి 30 వేల వ్యాక్సిన్లు కావాలని కోరగా ఆమె వెంటనే అంగీకరించారు. వ్యాక్సిన్ వినియోగంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, రెండో డోస్లో కూడా ఇదే విధంగా టీకా తీసుకొని ప్రజలందరికీ రక్షణ కల్పించేలా ఫ్రంట్ లైన్ వర్కర్లు కృషి చేయాలని కోరారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 120 బెడ్లతో కరోనా వార్డును ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందులో 35 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు, 65 ఆక్సిజన్ బెడ్లు, మరో 20 నాన్ ఆక్సిజన్ బెడ్లతో వార్డు ఉన్నట్లు చెప్పారు. వైద్యుల కోరిక మేరకు మిట్టపల్లిలోని సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుతం 120 బెడ్లలో 83 మంది కరోనా పేషెంట్లు ఉన్నారని , వీరిలో 12 మంది ఐసీయూలో, మిగితా వారు ఆక్సిజన్ బెడ్లలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
దేశమంతా ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతుంటే సిద్దిపేట ఆస్పత్రిలో మాత్రం ఆ పరిస్థితి లేదని హరీశ్రావు చెప్పారు. ఇక్కడ ముందుచూపుతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశామని, 13వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఇలాంటి ప్లాంటు మన రాష్ట్రంలోనే అతి పెద్దదని వివరించారు. ఆక్సిజన్ పుష్కలంగా ఉందని, ఆక్సిజన్ కొరతతో ఎవరి ప్రాణాలకు ముప్పు లేదని భరోసా ఇచ్చారు. ప్రతీ రోజు 900 లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తున్నట్లు చెప్పారు.
కరోనా పేషెంట్లకు ప్రాథమిక దశలో ఇచ్చే రెమిసిడివర్ ఇంజక్షన్లకు సిద్దిపేట ఆస్పత్రిలో కొరత లేదన్నారు. ప్రస్తుతం 274 రెమిసిడివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా మాస్కులు, పీపీఈ కిట్లు పూర్తిగా ఉన్నాయన్నారు. ఆస్పత్రిలోనూ సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తున్నారని , 8 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ మిగతా వారు మనోధైర్యంతో పనిచేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఒక కొవిడ్ అంబులెన్సును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కరోనా పేషెంట్లను తిరస్కరించవద్దని, వారిని అడ్మిట్ చేసుకోవాలని మంత్రి వైద్యులకు సూచించారు. చాలామంది ఇంట్లోనే హోం క్వారంటైన్ ఉంటున్నారన్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికే వస్తే ఆదరించాలని పేర్కొన్నారు. అన్ని వసతులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే మంచి భోజనం అందించాలన్నారు. ఇటు కరోనా రోగులకు సేవలందించడంతో పాటు డయాగ్నోస్టిక్, సీటీ స్కాన్ సేవలు కూడా అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సేవలు మెరుగవ్వాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేసి ప్రాణాలు కాపాడుతున్నారని ప్రశంసించారు.