సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు ఫుల్ డిమాండ్
సర్కారు బడే ముద్దంటున్న తల్లిదండ్రులు
చక్కర్లు కొట్టినా దొరకని అడ్మిషన్
ఏకంగా మంత్రిని ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు
160 సీట్లకు 600కు పైగా దరఖాస్తులు
అన్ని తరగతుల్లో ఉన్నవి 1108 సీట్లు
నాట్కో సహకారంతో సదుపాయాలు
జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ పాఠశాలగా అవార్డులు సొంతం
సిద్దిపేట అర్బన్, జూలై 21 : సిద్దిపేటలోని ఇందిరానగర్ సర్కారు బడి తీరే వేరు. ఈ బడిలో సీటు హాట్కేకు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు 180 సీట్లు ఉండగా.. ఈసారి 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనిని బట్టి ఈ పాఠశాలలో ప్రవేశాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. సాధారణంగా సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు అయిష్టత చూపుతుంటారు. కానీ, ఈ బడిలో చేర్పించడానికి మాత్రం పేరెంట్స్ చక్కర్లు కొడుతున్నారు. ఏటా అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టే అరుదైన దృశ్యం ఇక్కడ చూస్తుంటాం. ఐదేండ్లుగా ప్రవేశాల కోసం ఈ పాఠశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో సకల హంగులతో కార్పొరేట్కు దీటుగా ఈ బడి తీర్చిదిద్దబడింది. ఈసారి అడ్మిషన్ కోసం ఏకంగా మంత్రి హరీశ్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, పైఅధికారులను తల్లిదండ్రులు ఆశ్రయించడం విశేషం.
ఆరేండ్ల క్రితం 300 మంది విద్యార్థులు ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో క్రమక్రమంగా సీట్లు పెంచడంతో వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి 1108 విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఈ పాఠశాలకు, ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయి ఇంకా 350 పైచిలుకు విద్యార్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో నాలుగు సెక్షన్లు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లో ఐదు సెక్షన్ల చొప్పున తరగతులు బోధిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 23 సెక్షన్లుగా విభజించి తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరో తరగతిలో ప్రవేశాలకు 180 సీట్లు ఉండగా, 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సకల సౌకర్యాలకు నెలవు…
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అన్ని సదుపాయాలు కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతులు నిర్మించారు. డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరిగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూ నిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్ను ఏర్పా టు చేయించారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను సీసీ కెమెరాలతో అనుసంధానం చేశారు. ప్రతి రికార్డు ఆన్లైన్లోనే నిక్షిప్తం చేస్తున్నారు.