మారేడ్పల్లి, మే 11: తెలంగాణలో లాక్డౌన్ కారణంగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాస్పోర్టు సేవాకేంద్రాలు, లఘు కేంద్రాలు, పోస్టాఫీసు పాస్పోర్టు సేవాకేంద్రాలతో పాటు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలోని అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ ఆవరణలోని విదేశీ వ్యవహారాలశాఖకు చెందిన బ్రాంచ్ సెక్రటేరియెట్ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.