న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్
శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను టీకా తీసుకున్నానని, దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చాడు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నాడు. వైరస్ను ఓడించడంలో సహాయపడే టీకాను ప్రతిఒక్కరూ వీలైనంత త్వరగా తీసుకోవాలని, అందరూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థించాడు. టీకా వేసుకుంటుండగా తీసిన ఫొటోను షేర్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది తమ ఇళ్లకు చేరుకున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న ధావన్ ఈ ఏడాది సీజన్లో ధనాధన్ బ్యాటింగ్తో పరుగుల వరద పారించాడు. జట్టుకు శుభారంభాలు అందిస్తూ ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ వాయిదా పడటంతో ధావన్ టీకా వేయించుకున్నాడు. కొద్దిరోజుల క్రితం టీమ్ఇండియా హెచ్కోచ్ రవిశాస్త్రి తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నాడు.