ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ తల్లి విగ్రహం,జాతీయజెండా దిమ్మెలు, లవ్ గుర్తులు
మండలానికే ఆదర్శంగా కొప్పుసూరు నందనవనం
రూ.8 లక్షలతో నిర్మాణం
అందుబాటులోకి సెగ్రిగేషన్ షెడ్డు, శ్మశానవాటిక
పల్లె ప్రగతితో మెరుగైన వసతులు
వాజేడు, మార్చి 21 : పల్లె ప్రకృతి ఆ ఊరికి కొత్తందం తెచ్చింది. రకరకాల పూలు, అలంకరణ మొక్కలే కాదు.. అడుగడుగునా లవ్ సింబల్స్, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు దేశభక్తి పెంపొందేలా ఏర్పాటుచేసిన జాతీయ జెండా దిమ్మె, అశోక చక్రంతో కొప్పుసూరులోని పార్కు ప్రత్యేకత సంతరించుకుంది. పల్లె ప్రగతిలో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం-వాజేడు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన రూ.9.50లక్షలతో నిర్మించిన ఈ నందనవనం మండలానికే ఆదర్శంగా నిలుస్తోంది.
పల్లె ప్రగతిలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీలోని కొప్పుసూరులో రూపుదిద్దుకున్న ప్రకృతి వనం ప్రత్యేకత సంతరించుకుంది. వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన రూ.8 లక్షలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. మొక్కలను ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుంచి తెప్పించి నాటారు. పార్కుకు వచ్చే వారికి ఆహ్లాదం పంచేందుకు అనువైన వాతావరణం ఉండేలా సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పట్టణాలకు తీసిపోకుండా తెలంగాణ తల్లి విగ్రహం, జాతీయ జెండా దిమ్మె, అశోక చక్రంతో పాటు లవ్ సింబల్స్ ఏర్పాటుచేశారు.
పల్లె ప్రగతి పనులు గ్రామంలో శరవేగంగా పూర్తయ్యాయి. రూ.2లక్షల 50వేల వ్యయంతో సెగ్రిగేషన్ షెడ్డు పూర్తికాగా ఇప్పటికే వర్మికంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. అలాగే రూ.10 లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక పూర్తయి అందుబాటులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్తో మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. జీపీ ట్రాక్టర్లో పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తూ గ్రామంలోని వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
అంతేగాక వివిధ కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే మొక్కల పెంపకంతో పాటు వాటి సంరక్షణను పంచాయతీ కార్యదర్శి చిడెం నరేశ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. కార్యదర్శితో పాటు పలువురు దాతల సహకారంతో పార్క్లో బెంచీలు వేయించారు. ఇలా మండలంలోనే ప్రత్యేకంగా ఉన్న ఈ పార్కు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..
మన సంస్కృతి ఉట్టిపడేలా ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దాం. పార్కులో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం. మొక్కలను ఏపీ నుంచి తెప్పించి మండలంలోనే నంబర్ వన్గా తయారుచేశాం. ఇందుకోసం రూ.6 లక్షల నిధులతో పాటు అదనంగా గ్రామ పంచాయతీ నుంచి రూ.3లక్షల 50వేలు వెచ్చించి పూర్తిచేశాం.
మండలంలోనే ప్రత్యేకం..
కొప్పుసూరులో ఏర్పాటుచేసిన పల్లెప్రకృతివనం మండలంలోనే ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. సర్పంచ్తో కలిసి ప్రతి రోజు విజిట్ చేశాను. ఈ పార్కు ప్రధాన రహదారి పక్కనే ఉండడం వల్ల అన్ని రకాల మొక్కలు నాటి సౌకర్యాలు కల్పించారు. దాతలు బెంచీలు ఇవ్వగా ప్రత్యేకంగా కుండీలు కూడా ఏర్పాటు చేశారు.
అందరి సహకారంతో..
అందరి సహకారంతో ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాం. నిత్యం పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకున్నాం. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతిలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. గ్రామంలో సమస్యల పరిష్కారానికి ముందుంటాను.