జూబ్లీహిల్స్, మార్చి4: ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అన్నీ తెలిసిన పట్టభద్రులే బేరీజు వేయగలరని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ మహమూద్ ఫంక్షన్హాల్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించి అభివృద్ధికే తొలి ప్రాధాన్యతనిచ్చి ముందుకుసాగుతున్నారో అదే కోవలో అన్నీ తెలిసిన పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటుగా సురభి వాణీదేవికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి మాట్లాడుతూ నాడు కర్ఫ్యూలు లేకుండా పగలు, కరెంట్ లేకుండా రాత్రులు ఉండేవి కావని.. నేడు అవి జాడ కూడా లేవని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయని, బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కష్టాలకడలిలో ఉన్న దేశానికి బంగారు బాటలు వేసిన పీవీ కుమార్తెగా రాష్ర్టానికి తనవంతు సేవలందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ముందుకుసాగుతానన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ విద్యావంతులైన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన మార్పు కోరుతున్నారని పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణకు ముందు.. తరువాత పరిస్థితులను, అభివృద్ధిని అంచనా వేయడానికి పట్టభద్రులే సరైన నిర్ణేతలని, వారి విజ్ఞతతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, రాజ్కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి, దేదీప్యరావు, సంగీతా యాదవ్తో పాటు నాయకులు పల్లవి యాదవ్, సత్యనారాయణ, అప్పుఖాన్, కృష్ణమోహన్, నాయకులు పాల్గొన్నారు.