ముఖ్యమంత్రి సూచన మేరకు రూ.1200కోట్లు కేటాయించాం
ప్రతి పేద కుటుంబానికి రేషన్ బియ్యం
ఆరు నెలల్లో అందుబాటులోకి దుబ్బాక నూతన బస్టాండ్
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో పలు శంకుస్థాపనలు
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హాజరు
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ
సిద్దిపేట/ దుబ్బాక/ గజ్వేల్, జూలై 28:‘సంక్షేమానికి చిరునామాగా సీఎం కేసీఆర్ సర్కారు మారింది.. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచింది.. దళితబంధు పథకం కొత్తగా ఎన్నికల కోసం ప్రవేశ పెట్టలేదు.. 2021 అసెంబ్లీ బడ్జెట్లో సీఎం కేసీఆర్ సూచలన మేరకు దళితుల అభ్యున్నతి కోసం రూ.1200కోట్లను కేటాయించాం’.. అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో నిర్వహించిన రేషన్కార్డుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్తో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో దుబ్బాక బస్టాండ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, ఆ మేరకు రాష్ట్రంలో కొత్తగా 3,09,083 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ కార్యకర్తలు, నచ్చినవారికే రేషన్ కార్డులను ఇచ్చేదని, టీఆర్ఎస్ రాజకీయాలకతీతంగా ప్రతీ పేద కుటుంబానికి కార్డుతో పాటు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు.
ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి మంత్రి హరీశ్రావు బుధవారం దుబ్బాకలో విస్తృత్తంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చేర్వాపూర్ మారెమ్మ ఆలయం నుంచి దుబ్బాక వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్కు స్వాగతం పలికారు. మారెమ్మ ఆలయం లో పూజలు నిర్వహించిన మంత్రి ముందుగా వంద పడకల దవాఖాన వద్ద రూ.కోటి నిధులతో రోడ్డు నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4కోట్లతో నిర్మించే నూతన బస్స్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్రూంల వద్ద రూ.40లక్షలతో షాంపింగ్ కాంప్లెక్స్, రూ.50 లక్షలతో మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.20 లక్షలతో బాబూజగ్జీవన్రామ్ భవనం, రూ.10 లక్షలతో మాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం బాలాజీ గార్డెన్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని అమలు చేసే ధైర్యం ఎవరూ చేయలేదని, ఈ పథకం అమలు కేవ లం కేసీఆర్తోనే సాధ్యపడిందన్నారు. ఈ పథకంపై కొందరు తెలిసీతెలియక ఎన్నికల కోసం తెచ్చారంటున్నారని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో దళితుల సంక్షేమానికి 2021 మార్చిలో అసెంబ్లీ బడ్జెట్లో దళితుల సంక్షేమానికి రూ.1200 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు చిరునామాగా మారిందని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు.
ఆరు నెలల్లోగా నూతన బస్టాండ్ అందుబాటులోకి..
దుబ్బాక నూతన బస్టాండ్ను ఆరు నెలల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి హరీశ్రావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత బస్టాండ్ను పరిశీలించి వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈ సుదర్శన్రెడ్డికి సూచించారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నూతన బస్టాండ్ నిర్మాణ నమూనాను మంత్రికి చూపించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యూమ్నాయ చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్ నాయక్ను మంత్రి ఫోన్లో ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్గా దుబ్బాక బస్టాండ్ నిర్మాణం జరుగాలని అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్గౌడ్, ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖరాజు, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.ఆసీఫ్, టీఆర్ఎస్ నాయకులు, రేకులకుంట మల్లన్న ఆలయ చైర్మన్ రొట్టె రమేశ్ పాల్గొన్నారు.
దుబ్బాక బాలాజీ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి
దుబ్బాక టౌన్, జూలై 28 : తెలంగాణకే తలమానికంగా నిర్మించిన దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణాన్ని మంత్రి హరీశ్రావు బుధవారం సందర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి సందర్శించిన మంత్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికి ఆలయ నిర్మాణాన్ని చూపించారు.
దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా…ప్రజలంతా తెలంగాణ బిడ్డలే…!
దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా.. ప్రజలంతా తెలంగాణ బిడ్డలేనని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దుబ్బాకలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, దుబ్బాకపై తనకు, సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదువుకున్న బడికి రూ.10 కోట్లు వెచ్చించి అధునాతనంగా నిర్మించారని తెలిపారు. ఆ పాఠశాల ప్రహరీకి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు. దుబ్బాకకు ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.35 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిర్మాణం పూర్తయినా డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలోనే అందిస్తామన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరువతో దుబ్బాకకు వంద పడకల దవాఖాన మంజూరైందన్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.