పంటల మార్చిడికి ప్రోత్సాహం..
ప్రస్తుత సీజన్లో రైతులు పంట మార్పిడి పాటించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. దేశవ్యాప్తంగా వరి ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో దానికి డిమాండ్ తగ్గింది. రైతులు వరి స్థానంలో ఇతర పంటలను సాగుచేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు రైతులను పంటల మార్పిడి వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో లక్షకుపైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులను కార్యోన్ముఖులను చేస్తున్నారు. పంట మార్పిడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసేలా గ్రామాల్లో రైతుల్లో రైతులకు వ్యవసాయశాఖ అవగాహన కల్పిస్తున్నది. ఆరుతడి పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నది. వానకాలంలో జిల్లాలో ఎక్కువగా రైతులు వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను వేస్తున్నారు. వరి సాగు చేయడంతో భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ధాన్యం అమ్మకానికి రైతులకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, వరి స్థానంలో పత్తి, కంది, పెసర, వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నూనెగింజల కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు వేరుశనగ(పల్లి), నువ్వులు, ఆవాలు, కుసుమ పంటలను సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు పెసర, మినుము, నువ్వులు, రాగి, జొన్న, వేరుశనగ పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పంటల మార్పిడితో రైతుకు ప్రయోజనం
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించేలా చర్యలు
వరి, మొక్కజొన్న, సోయా తగ్గించాలని రైతులకు సూచన
కంది, పత్తి, పప్పుదినుసులు, నూనెగింజ పంటలు వేసేలా ప్రోత్సాహం
రైతులను కార్యోన్ముఖులను చేస్తున్న వ్యవసాయశాఖ
లక్షల ఎకరాల్లో ఈసారి కొత్త పంటలకు అవకాశం
పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
కంది, పత్తి పంటల సాగు మళ్లింపు..
ఈ సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల స్థానంలో ఇతర ఆరుతడి పంటలు సాగుచేసేలా వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. రైతుల ఎక్కువగా పత్తి, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు పంటలు సాగు చేసేలా సిద్ధం చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్ 7,40,485 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయశాఖ, ఇందులో ఎక్కువగా కంది, పత్తి పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటున్నది. గతేడాది వానకాలం సీజన్లో జిల్లాలో 78,522 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈసారి వరి రైతులు 5వేల ఎకరాలు మించకుండా చర్యలు చేపడుతున్నది. గత వానకాలంలో రైతులు 72,806 ఎకరాల్లో రైతులు సోయాబీన్ సాగుచేశారు. సోయాబీన్ స్థానంలో రైతులు పత్తి, కంది పంటలు సాగుచేసేలా వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. దీంతో సీజన్లో సోయాబీన్ సాగు కేవలం 15,000 ఎకరాలకే పరిమితం కానుంది. 57,806 ఎకరాల్లో పంటమార్పిడి జరుగన్నది. సోయాబీన్ స్థానంలో రైతులు పత్తి, కంది పంటలను సాగు చేయనున్నారు. మొక్కజొన్న సాగు చేసే రైతులను ఇతర పంటల సాగువైపు మళ్లించనున్నారు. జిల్లాలో 30వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తారు. ఈ ఏడాది 18వేల ఎకరాలకు మొక్కజొన్న సాగు పరిమితం కానుంది. జిల్లాలో గత వానకాలంలో రైతులు 3,99,895 ఎకరాల్లో పత్తి సాగు చేశా రు. ఈ సీజన్లో 4,20,000 ఎకరాల్లో పత్తి సాగు కానుందని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది కంటే అదనంగా 20,105 ఎకరాల్లో పత్తి సాగు పెరగనుంది. గత వానకాలంలో రైతులు 1,08,433 ఎకరాల్లో కంది సాగుచేశారు. ఈ సీజన్లో 1,30,000 ఎకరాల్లో కంది పంట సాగు కానుంది. అంటే అదనంగా 21,567 ఎకరాల్లో సాగు కానుంది. వీటితో పాటు పెసర, మినుము, అనుములు తదితర పంటల విస్తీర్ణం 5వేల ఎకరాల మేర పెరుగనుంది. నూనె గింజలకు సంబంధించి పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వుల పంటల సాగు పెరుగనుంది. ఈసారి 500 నుంచి 2000 ఎకరాలకు వరకు నూనెగింజల సాగు పెరుగవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్పాం సాగు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో వానకాలం సాగు అంచనాను అధికారులు సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలో 5,30,576 ఎకరాలు, మెదక్ జిల్లాలో 3,21,650 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 7,40,845 ఎకరాల్లో అన్నిరకాల పంటలు సాగు కానున్నాయని వ్యవసాయశాఖ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి కొత్తగా సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉత్సాహవంతులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ పంట సాగుపై వ్యవసాయశాఖ అవగాహన కల్పిస్తున్నది.
పంటల మార్పిడితో రైతులకు లాభం..
పంటల మార్పిడితో రైతులకు లాభం చేకూరుతుంది. రైతులు పంటమార్పిడి పాటించేలా ప్రోత్సహిస్తున్నాం. గత వానకాలం సీజన్తో పోలిస్తే రైతులు లక్ష ఎకరాల్లో పంటమార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల స్థానంలో రైతులు కంది, పత్తి, వేరుశనగా, పప్పుదినుసులు. ఇతర ఆరుతడి పంటలు సాగుచేస్తే మంచి ధరలు పొందవచ్చు. వరి సాగుతో భూగర్భ జలాలు వినియోగం పెరుగడంతో పాటు మార్కెట్లో డిమాండ్ లేక తగిన ధర దక్కే అవకాశం ఉండదు. వరి స్థానంలో రైతులు పత్తి, కంది, పెసర, మినుము పంటలను సాగుచేసేలా సూచిస్తున్నాం. మొక్కజొన్న స్థానంలో కంది, సోయాబీన్ స్థానంలో పత్తి, కంది పంటలు సాగుచేయాలని సూచిస్తున్నాం. నూనెగింజ పంటలకు డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో వేరుశనగ, నువ్వులు, ఆవాల పంటలు సాగుకు ప్రోత్సహిస్తున్నాం.