ముంబై: రిలయెన్స్ ఏం చేసినా, మార్కెట్లోకి ఏ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా సంచలనమే. నాలుగేళ్ల కిందట జియో ఫీచర్ ఫోన్ను రిలీజ్ చేసినప్పుడు.. కేవలం రూ.1500కే అది కూడా మూడేళ్ల తర్వాత తిరిగిస్తే ఆ మొత్తం తిరిగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పుడు జియోఫోన్ నెక్ట్స్( JioPhone Next ) పేరుతో అత్యంత చవకగా.. 4జీ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెబుతోంది. ఈ నెల 10న ఆ ఫోన్ రిలీజ్ అవుతుందని గతంలోనే ముకేశ్ అంబానీ ప్రకటించారు. అయితే తాజాగా ఈ ఫోన్ను చీప్గానే కాదు.. మొదట కేవలం రూ.500 కడితే చాలు ఇచ్చేయాలని రిలయెన్స్ జియో భావిస్తున్నట్లు ఈటీ నవ్ రిపోర్ట్ వెల్లడించింది.
రూ.500కే ఎలా?
ఈ జియోఫోన్ నెక్ట్స్ రెండు మోడల్స్లో రాబోతోంది. అందులో బేసిక్ మోడల్ ధరను రూ.5000గా, అడ్వాన్స్ మోడల్ ధరను రూ.7000గా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల్లోనే 5 కోట్ల మొబైల్స్ అమ్మి.. రూ.10 వేల కోట్ల బిజినెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జియో.. దీనికోసం వివిధ బ్యాంకులతోనూ చేతులు కలుపుతోంది. వివిధ పేమెంట్ మోడ్లలో ఈ జియోఫోన్ నెక్ట్స్ కొనుగోలు చేయొచ్చు. ఒకేసారి మొత్తం ధర చెల్లించి తీసుకోవచ్చు. లేదంటే ఆ ఫోన్ మొత్తంలో కేవలం పది శాతం.. అంటే బేసిక్ మోడల్ విషయంలో రూ.500 చెల్లించి మిగతా మొత్తాన్ని వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు.
దీనికోసమే జియో.. ఎస్బీఐ, పిరమల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అస్యూర్, డీఎంఐ ఫైనాన్స్లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. మొదట కస్టమర్ మొబైల్ విలువలో 10 శాతం చెల్లిస్తే చాలు. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని ఈ బ్యాంకుల్లో ఏదో ఒకదానికి వాయిదాలలో చెల్లించాలి. అయితే దీనిపై వడ్డీ ఉంటుందా లేదా అన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఈటీ నవ్ న్యూస్ రిపోర్ట్ ఇలా ఉండగా.. మరోవైపు జియోఫోన్ నెక్ట్స్ ధర కేవలం రూ.3499 మాత్రమే ఉండొచ్చన్న వార్తలూ వస్తున్నాయి. దీని ధరపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇది కానుందని మాత్రం చెప్పింది. గూగుల్తో కలిసి ఈ ఫోన్ను జియో తీసుకొస్తోంది.