Space | న్యూఢిల్లీ: అంతరిక్ష సవాళ్లను చేధించేందుకు భారత్ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మానవ సహిత యాత్రలు పుంజుకుంటున్నాయి. అమెరికా, రష్యా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాయి. మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు అంతరిక్ష ప్రయాణం సాధారణమైపోతున్నది. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు భారత్ సన్నాహాలు చేస్తున్నది. 2025లో చంద్రుడిపైకి ఓ బృందాన్ని పంపాలని నాసా ప్రణాళికలు రచిస్తున్నది. రానున్న రోజుల్లో పక్క ఊరికి వెళ్లి వచ్చినట్టే అంతరిక్షాన్ని సందర్శించే రోజులు రావచ్చు. ఈ క్రమంలో అంతరిక్షంలో ఒకవేళ ప్రమాదం సంభవించి వ్యోమగాములు, అంతరిక్ష యాత్రికులు మరణిస్తే ఏంటి పరిస్థితి? వారి మృతదేహాలను ఏం చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి హ్యూస్టన్లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన స్పేస్ మెడిసిన్, ఎమర్జెన్సీ ప్రొఫెసర్ ఇమాన్యుయేల్ ఉర్కెట సమాధానమిచ్చారు.
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లాంటి తక్కువ ఎత్తులోని కక్ష్య వద్ద వ్యోమగాములు చనిపోతే మృతదేహాలను ప్రత్యేకక్యాప్సుల్ ద్వారా గంటల వ్యవధిలో భూమికి చేర్చవచ్చు. ఒకవేళ చంద్రుడిపై మరణం సంభవిస్తే… కొన్ని రోజుల్లో మృతదేహాన్ని భూమికి తీసుకురావచ్చు. దీనికి సంబంధించి నాసా ప్రొటోకాల్ను రూపొందించింది. స్థిరమైన ఉష్ణోగ్రత ఉండే వ్యోమనౌకలో నుంచి స్పేస్సూట్ లేకుండా వ్యోమగామి చంద్రుడు, అంగారకుడిపై అడుగుపెడితే వాతావరణ కారణాలతో వెంటనే ప్రాణాలు కోల్పోతారు. అంతరిక్షంలో మృతదేహాలను దహనం చేయడం వల్ల మృతదేహాలపై ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్యక్రిములు అక్కడి వాతావరణంలో కలిసిపోయి కలుషితం చేస్తాయి. దీనికి బదులు ఆ మృతదేహాలను భద్రపరిచి, కుటుంబసభ్యులకు అందజేసేందుకు ప్రయత్నిస్తారు.
60 ఏండ్ల క్రితమే అంతరిక్ష యాత్ర మొదలైంది. ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు మరణించారు. 1986-2003 వరకు నాసా నిర్వహించిన ప్రయోగాల్లో 14 మంది చనిపోగా, 1967లో జరిగిన అపోలో లాంచ్ప్యాడ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు, 1971లో నిర్వహించిన సోయుజ్ 11 ప్రయోగంలో మరో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
భూమికి 300 మిలియన్ మైళ్ల దూరంలోని అంగారకుడిపై మరణం సంభవిస్తే మాత్రం ఆ మృతదేహాన్ని తీసుకురావడం ఆలస్యమవుతుంది. మిషన్ను మధ్యలో ఆపేసి మిలియన్ మైళ్ల దూరం నుంచి అర్ధాంతరంగా వారు తిరిగిరాలేరు. కాబట్టి మిషన్ పూర్తయ్యాక మృతదేహాన్ని తీసుకొని వస్తారు. దీనికి ఏండ్లు కూడా పట్టవచ్చు. అప్పటి వరకు మృతదేహాన్ని స్థిరమైన వాతావరణం ఉండే వ్యోమనౌకలోని ప్రత్యేకమైన చాంబర్లో భద్రపరుస్తారు. ఇదంతా వ్యోమనౌకలో ఎవరైనా మరణిస్తేనే జరిగేందుకు ఆస్కారం ఉంది.